నారద వర్తమాన సమాచారం
రైల్వే సమస్యలను పరిష్కరించండి
సౌత్ సెంట్రల్ రైల్వే జిఎం అరుణ్ కుమార్ ని కలిసి పలు సమస్యలను వివరించిన ఎంపి శ్రీకృష్ణదేవరాయలు
రైల్వే సమస్యలు పరిష్కారం కోరుతూ ఈరోజు హైదరాబాదులోని రైల్ నిలయంలో సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ ను టిడిపి పార్లమెంటరీ నేత, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు విన్నవించారు. పలు సమస్యలకు సంబంధించిన వినతి పత్రాన్ని జిఎంకు ఎంపీ అందజేశారు.
పల్నాడు ప్రజలకు మేలు కలిగేలా.. ప్రస్తుతం సికింద్రాబాద్ నుండి తిరుపతి వరకు ఉన్న వందేభారత్ ఎక్స్ప్రెస్ కు పిడుగురాళ్ల స్టేషన్లో స్టాపేజ్ ఇవ్వాలని కోరారు. అలాగే విజయవాడ నుండి బెంగుళూరు వరకు.. నరసరావుపేట, వినుకొండలో స్టాప్లతో కొత్త వందేభారత్ రైలుని ప్రారంభించాలని కోరారు. పెదకూరపాడు స్టేషన్ లో పల్నాడు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్కు స్టాపేజ్ని ఇవ్వాలని, సత్తెనపల్లి స్టేషన్లో ఫలక్నుమా ఎక్స్ప్రెస్ కు స్టాపేజీ ఇవ్వాలని, విశాఖపట్నం నుండి గుంటూరు సింహాద్రి ఎక్స్ప్రెస్ రైలును పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేట పట్టణం వరకు పొడిగించాలని విజ్ఞప్తి చేసారు. పేరుచెర్ల నుండి గన్నవరం లేదా పెదవుటపల్లికి కొత్త ఎమ్ఎమ్ టిఎస్ రైలు సేవలను పరిచయం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. పల్నాడు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ విజయవంతంగా 25 సంవత్సరాల సేవలను పూర్తి చేసుకుందని, ప్రస్తుతం ఉన్న బోగీలను వందే భారత్ రైళ్ల ప్రమాణాలతో కొత్త బోగీలకు మార్చాలని కోరారు. కొత్త జిల్లా పల్నాడులో ఆర్ ఓబీలు, ఆర్యుబిలు నిర్మాణ పనులు పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని, కొత్తవి మంజూరు చేయాలని కోరారు.
పల్నాడు జిల్లాలోని నరసరావుపేట, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, వినుకొండ, మాచర్ల, నడికుడి రైల్వే స్టేషన్లను ప్రతిష్టాత్మకమైన అమృత్ భారత్ స్టేషన్ పథకం ఆధునికీకరణ చేపట్టాలని కోరారు. రైల్వే లైన్ పనులని పూర్తి చెయాలనీ కోరారు.