నారద వర్తమాన సమాచారం
ఢిల్లీ ప్రజలు తప్పు తెలుసుకుని కష్టాల నుంచి బయటపడ్డారు: సీఎం చంద్రబాబు
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై చంద్రబాబు స్పందన
ఏపీలోనూ, ఢిల్లీలోనూ ప్రజల ఆకాంక్షలు పట్టించుకోలేదని వెల్లడి
ఓటేసిన పాపానికి ప్రజలను కాటేశారని విమర్శలు
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు.
ఉండవల్లిలోని నివాసంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ రోజు ఢిల్లీలో బీజేపీ గెలుపు, కేవలం ఢిల్లీ ప్రజల గెలుపు కాదని… ఇది దేశ ప్రజల గెలుపు కూడా అని అభివర్ణించారు. పీపుల్స్ ఫస్ట్ అనే మోడల్ మాత్రమే పని చేస్తుందని ఈ ఎన్నిక మరోసారి నిరూపించిందని అన్నారు. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీ ప్రజలు బీజేపీకి పట్టం కట్టారని, ఇది చారిత్రాత్మకం అని వివరించారు.
కొందరు నేతలు సంక్షేమ కార్యక్రమాల పేరుతో అవినీతికి పాల్పడుతున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. ఇటువంటి కొందరు నేతల వల్ల రాజకీయ కాలుష్యం పెరుగుతోందని వ్యాఖ్యానించారు.
ఆమ్ ఆద్మీ పార్టీ పాలనలో ఢిల్లీలో ఎక్కడ చూసినా చెత్త పేరుకుపోయిందని అన్నారు. కొన్ని విధానాలవల్ల ఢిల్లీ అత్యంత కాలుష్య నగరంగా మారిందని తెలిపారు. ఒకప్పుడు పంజాబ్ రాష్ట్రానికి అన్ని రంగాల్లో మంచి పేరుండేదని, ఇవాళ పంజాబ్ అంటే డ్రగ్స్ గుర్తుకువస్తున్నాయని చంద్రబాబు విమర్శించారు.
ఇటు, ఏపీలో వైసీపీ పాలనలో మద్యం మాఫియా తయారైందని ఆరోపించారు. ఏపీలో, ఢిల్లీలో అమలు చేసిన పాలసీలకు విజయం దక్కలేదని స్పష్టం చేశారు. ఏపీలోనూ, ఢిల్లీలోనూ ప్రజల ఆకాంక్షలను పట్టించుకోలేదని, ఓటేసిన పాపానికి ప్రజల భవిష్యత్తును కాటేశారని, ప్రజల అవకాశాలను పూర్తిగా నాశనం చేశారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. సంపద సృష్టించలేని, ప్రభుత్వానికి ఆదాయం పెంచలేని నేతలు ఎందుకు? అని ప్రశ్నించారు. ప్రజల జీవన ప్రమాణాలు, తలసరి ఆదాయం పెరుగుతూ ఉండాలని… కానీ ఏపీ, ఢిల్లీలో ఈ అంశాలు తిరోమగనం చెందాయని అన్నారు.
అయితే… ఏపీ, ఢిల్లీ ప్రజలు తప్పు తెలుసుకుని కష్టాల నుంచి బయటపడ్డారని చంద్రబాబు వెల్లడించారు. గుజరాత్ లో సుస్థిర పాలన కారణంగా వృద్ధి రేటు బాగా పెరిగిందని తెలిపారు. చాలా రాష్ట్రాలను దాటుకుని గుజరాత్ లో తలసరి ఆదాయం పెరిగిందని అన్నారు. మోదీ విధానాలు సరైనవని ప్రజలు నమ్ముతున్నారని, గుజరాత్ లో మోదీ తెచ్చిన విధానాలు అత్యుత్తమ ఫలితాలు ఇచ్చాయని తెలిపారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.