నారద వర్తమాన సమాచారం
రాష్ట్రంలో తొలి జీబీఎస్ మరణం.. చికిత్స పొందుతూ 25 ఏండ్ల మహిళ మృతి.!!
మహారాష్ట్రను వణికిస్తున్న గులియన్ బారీ సిండ్రోమ్ (GBS).. తెలంగాణలోనూ కలకలం సృష్టిస్తున్నది. ఈ వ్యాధిబారిన పడిన ఓ 25 ఏండ్ల మహిళ మరణించింది.
సిద్దిపేట జిల్లా సిద్దిపేట గ్రామీణ మండలం సీతారాంపల్లికి చెందిన వివాహిత జీబీఎస్ అనే నరాల వ్యాధి బారిన పడిన విషయం తెలిసిందే. గత పది రోజుల క్రితమే ఆమెకు వ్యాధి నిర్ధారణ అయింది. అప్పటినుంచి ఆమె హైదరాబాద్లోని ఓ దవాఖానలో చికిత్స పొందుతున్నది. అయితే పరిస్థితి విషమించడంతో ఆమె మరణించినట్లు డాక్టర్లు వెల్లడించారు. రాష్ట్రంలో ఇదే తొలి మరణమని తెలిపారు.
కాగా, బాధితురాలికి ఐదేళ్లలోపు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇటీవలే కుమార్తె జన్మనిచ్చారు. ఆ తర్వాత నెల రోజుల కిందట నరాల నొప్పులతో మహిళ అనారోగ్యం బారిన పడింది. దీంతో కుటుంబ సభ్యులు సిద్దిపేట, హైదరాబాద్లోని నిమ్స్తోపాటు పలు ప్రైవేటు హాస్పిటళ్లలో చికిత్స చేయించారు. ఇలా ఆమె వైద్యానికి రూ.లక్షలు వెచ్చించారు. అయినా ఫలితం లేకుండాపోయింది. చివరికి దవాఖానలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్రలోని పుణెలో జీబీఎస్ కారణంగా పలువురు మృతి చెందిన విషయం తెలిసిందే.
వ్యాధి లక్షణాలు ఇవే..
శరీరానికి సోకిన ఇన్ఫెక్షన్కు ప్రతిస్పందించే రోగ నిరోధక వ్యవస్థ శరీరంలోని నరాలపై దాడిచేసే అరుదైన పరిస్థితిని గులియన్ బారే సిండ్రోమ్ అని అంటారు. జీబీఎస్ వ్యాధి సోకిన వారిలో శరీరమంతా తిమ్మిరిగా అనిపిస్తుంది. తీవ్రమైన జ్వరం, వాంతులు వంటి లక్షణాలు ప్రాథమిక దశలో కనిపిస్తాయి. వీటితోపాటు పొత్తికడుపు నొప్పి, ఒక్కసారిగా నీరసంగా అనిపించడం, డయేరియా, కండరాలు బలహీనంగా మారడం వంటివి గులియన్ బారే సిండ్రోమ్ లక్షణాలు. ఈ వైరస్ నీటి ద్వారా, కలుషిత ఆహారం తీసుకోవడం ద్వారా బ్యాక్టీరియా రూపంలో సోకుతుంది.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.