Thursday, March 13, 2025

మహాశివరాత్రి మనం ఎందుకు జరుపుకుంటాము ?

నారద వర్తమాన సమాచారం

మహాశివరాత్రి మనం ఎందుకు జరుపుకుంటాము ?

మహాశివరాత్రిని శివ భక్తులు ప్రత్యేకమైన రోజుగా భావిస్తారు. ఈశ్వరునితో మనసును మమేకం చేసే రోజు. అయితే శివరాత్రిని ఎందుకు జరుపుకుంటారు? అంటే…. శివపురాణం వర్ణన ప్రకారం లింగోద్భవం జరిగిన రోజుగా భావిస్తారు. లింగోద్భవమూర్తి అనేది శివుని యొక్క ప్రతిరూపం, ఇది అన్ని శివాలయాల గర్భగుడి వెనుక దేవకోష్టలో ప్రతిష్టించబడింది. లింగోద్భవ కథ ఏమిటంటే, కూర్మ పురాణం, వాయు పురాణం మరియు శివ పురాణాలలో చెప్పినట్లుగా, శివుని మూలాలను (ప్రారంభం ఆది మరియు ముగింపు అంతం) కనుగొనడానికి విష్ణువు మరియు బ్రహ్మ చేసిన ప్రయత్నాలు. ఏదైతే శివలింగం ఇప్పుడు పూజిస్తున్నమో ఆ లింగం ఉద్భవించిన రోజు అన్నమాట. ఒకనాడు ఋషులు సూత మహామునిని ఇలా ప్రశ్నిస్తారు, ఇతర ఏ దేవతలకూ లేని లింగ పూజలు కేవలం మహేశ్వరునికి మాత్రమే ఎందుకు? అందరు దేవతలకూ రూపాలు ఉన్నాయి కానీ శివునికి ఎందుకని రూపం లేదు?ఆ లింగానికి అర్ధం ఏమిటి? లింగం దేనిని సూచిస్తుంది? అని మహర్షులు ప్రశ్నించగా, సూత మహాముని లింగోద్భవ గాధని తెలియజేస్తాడు. విష్ణువు నాభి నుండి ఒక కమలంలో బ్రహ్మ ఉద్భవిస్తాడు. నేను ఎవరు? ఎక్కడ నుండి వచ్చాను? నా మూలం ఏమిటి అని బ్రహ్మ జిజ్ఞాసతో ఆలోచిస్తాడు. అది తెలుసుకొనడానికి ఆ కమలం యొక్క మూల స్థానం వెతుకుతూ చేరుకుని అక్కడ యోగ నిద్రలో శయనించి ఉన్న విష్ణువుని చూస్తాడు. విష్ణువుని గమనించని బ్రహ్మ తానే సృష్టికర్త అందరికంటే గొప్పవాడని అనుకుంటాడు. దానికి విష్ణువు తానే విశ్వ నిర్మాత అని సమాధానమిచ్చాడు. ఒకరిపై ఒకరు తమ ఆధిపత్యం గురించి ఇద్దరి మధ్య వాదన జరిగింది, అప్పుడు వారి ముందు ఒక పెద్ద అగ్ని లింగం కనిపించింది దాని నుండి జ్వాలలు బయటకు వస్తున్నాయి.అది చాలా ప్రకాశవంతంగా ఉండటం వలన వారు దాని పైభాగాన్ని లేదా క్రింది భాగాన్ని చూడలేకపోయారు. బ్రహ్మ మరియు విష్ణువు ఆశ్చర్యపోయి, “ఇది ఏమిటి?” అని అడిగారు. ఆ అగ్ని స్తంభం నుండి నేను శివుడిని అనే స్వరం వచ్చింది మరియు వారి పోరాటాన్ని పరిష్కరించడానికి భగవంతుడగు శివుడు తన అనంతమైన అగ్ని స్తంభం యొక్క ఆది, అంతం కనుగొనమని వారిని సవాలు చేశాడు. అగ్ని లింగ మాటలు విన్న బ్రహ్మ గండరూపం ధరించి పైకి వెళ్ళాడు మరియు విష్ణువు వరాహరూపం ధరించి క్రిందికి వెళ్ళాడు. బ్రహ్మ లేదా విష్ణువు ఇద్దరూ శివుని అగ్ని స్తంభం యొక్క ప్రారంభం లేదా ముగింపును కనుగొనలేకపోయారు.

ఆ విధంగా, వారు తమ ఓటమిని అంగీకరించి, శివుని ముందు నమస్కరించి, వినయంగా లింగాన్ని పూజించి, శివుడిని పరమ సత్యంగా అంగీకరించారు.ఈ కథను లింగోద్భవం అని పిలుస్తారు, అంటే “లింగం యొక్క ఆవిర్భావం”. లింగోద్భవాన్ని మహాశివరాత్రిగా జరుపుకుంటారు. కాబట్టి హిందువులు మహాశివరాత్రిని లింగోద్భవ శివుడిగా జరుపుకోవాలి, ఇది శివుడు “అగ్ని లింగం”గా మొదటిసారి కనిపించిన రోజు మరియు ఈ రోజున బ్రహ్మ & విష్ణువు శివుడిని మరియు శివలింగాన్ని పూజిస్తారు.

శివరాత్రి అంటే ?శివరాత్రి పూజావిధానం ఎలా చేయాలి ?

వేదాలు ఇతిహాస పురాణాలలో ముఖ్యమైనవి. ఋగ్వేదం చాలా గొప్పది. ఇందులో ఉన్నటువంటి రుద్రం ఇంకా గొప్పది. పంచాక్షరీలోని శివ అనే రెండక్షరాలు మరీ గొప్పవి. శివ అంటే మంగళమని అర్థం. పరమ మంగళకరమైనది శివస్వరూపం. ఆ పరమ శివుని అనుగ్రహం పొందటానికి మనం జరుపుకునే ముఖ్యమైన పండుగ మహాశివరాత్రి. పురాణాలలో చెప్పినటువంటి ఈ మహాశివరాత్రిని ప్రతి సంవత్సరం మాఘమాసం కృష్ణపక్షంలో చతుర్థశినాడు జరుపుకుంటాం.

శివరాత్రులు ఎన్ని ?

శివరాత్రి వైదిక కాలం నాటి పండుగ. ఏడాదిలో వచ్చే శివరాత్రులు మొత్తం అయిదు. అవి :
నిత్య శివరాత్రి , పక్షశివరాత్రి , మాసశివరాత్రి , మహాశివరాత్రి , యోగశివరాత్రి. వీటిలో పరమేశ్వరుడి పర్వదినం మహాశివరాత్రి. మార్గశిరమాసంలో బహుళ చతుర్థి , అర్ద్ర నక్షత్రం రోజున శివుడు లింగోద్భవం జరిగింది. శివునికి అతి ఇష్టమైన తిథి అది. అందుకే ఈరోజున శివుడ్ని లింగాత్మకంగా ఆరాధించిన వారెవరైనా సరై పురుషోత్తముడు అవుతాడని పురాణాల మాట. ఈ రోజున శివ ప్రతిష్ట చేసినా లేక శివకళ్యాణం చేసినా ఎంతో శ్రేష్టం. మహాశివరాత్రి రోజు తనను పూజిస్తే తన కుమారుడైన కుమారస్వామి కన్నా ఇష్టులవుతారని శివుడు చెప్పడాన్ని బట్టి ఈ విశిష్టత ఏంటో అర్థం చేసుకోవచ్చు. త్రయోదశినాడు ఒంటిపొద్దు ఉండి చతుర్థశినాడు ఉపవాసం ఉండాలి. అష్టమి సోమవారంతో కూడి వచ్చే కృష్ణ చతుర్థశి నాటి మహాశివరాత్రి మరింత శ్రేష్టమైందంటారు.

లింగోద్భవ కాలం ప్రకారం జన్మాష్టమి నుంచి 180 రోజులు లెక్కిస్తే శివ రాత్రి వస్తుంది. రూపరహితుడైన శివుడు , జ్యోతిరూపంలో , లింగాకారంగా అవిర్భవించిన సమయం కనుక శివరాత్రిని లింగోద్భవకాలం అంటారు. ఈ పరమేశ్వరుడి 64 స్వరూపాలలో లింగోద్భవమూర్తి చాలా ముఖ్యమైనది. అర్థరాత్రి పన్నెండు గంటలకు లింగోద్భవ సమయమని పురాణాలలో చెప్పారు. ఋగ్వేదం ప్రకారం భక్తజనులు ఆరోజు నిద్ర పోకుండా మేల్కొని ఉపవాసముండి , మహాలింగ దర్శనం చేస్తారు. ఉపవాస దీక్ష స్త్రీలు , పురుషులు కూడా ఆచరించదగినదే. ప్రపంచమంతా శివ శక్తిమయమని తెలుసుకోవాలి. శివలింగానికి ప్రణవానికి సామ్యముందంటారు.

ఆ పంధాలో చూస్తే ఈ శివలింగం ఆరువిధాలు ఇలా ఒక్కొక్క విధానంలో ఆరేసి లింగాలు ద్వివిదా ద్వాదశలింగాలుగా చెప్పబడుతున్నప్పటికీ , శివాగమాలరీత్యా మాత్రం ఆచార గర్వాది లింగాలే సరియైనవి కనుక ఈ ఆరులింగాలనే అనుదినం ఆరాధించాలి. పరమశివుడు శివరాత్రి పర్వదినమున ఎన్నో విధాలుగా ఆలంకరింపబడతాడు. ఆ స్వరూపాలలో విభూతిధారణ ఒకటి. విభూతి అంటే ఐశ్వర్యం. అది అగ్నిలో కాలిన శుద్ధమైన వస్తువు. ఈశ్వరుడు ఒంటి నిండా విభూతి అద్దుకుంటాడు. రెండవది రుద్రాక్ష. రుద్రాక్ష అంటే శివుని మూడవ కన్ను. అందరు దేవతలలో ఫాలభాగంలో కన్ను గలవాడు ఆయన ఒక్కడే.

మూడవది పంచాక్షరి జపం. పంచాక్షరీ మంత్రోపదేశం లేనివారు శివనామాం జపిస్తే చాలు. నాలుగవది మారేడు దళాలతో శివున్ని పూజించడం. శివునికి మూడు దళాలుంటాయి. అయిదవది అంతరంగంలో శివ స్వరూపాన్ని ఎల్లవేళలా స్మరిస్తూ ఉండాలి. శివరాత్రి రోజున సాయంకాల సమయాన్ని ప్రదోషం అంటారు. త్రయోదశి వాటి సంధ్యాకాలం మహా ప్రదోషం. ప్రదోష సమయంలో శివస్మరణ , శివదర్శనం విధిగా చెయ్యాలి. వేదాలన్నింటికీ తాత్పర్యం ఓంకారం. ఆ ఓంకార స్వరూపమే పరమేశ్వరుడు. ‘శివ’ శబ్దాన్ని దీర్ఘంతీస్తే ‘శివా’ ఆవుతుంది. అది అమ్మవారి పేరు ఈ స్వరూప ధ్యేయమే జగత్తుకు తల్లిదండ్రులు. పార్వతీపరమేశ్వరులు , సూర్యుడు , అగ్ని ఈ మూడింటిలోను శివుడుంటాడు. పరమ శాంతినిచ్చేది శివనామస్మరణమే. శివస్మరణకు అందరూ అర్హలే. పరమ శివునికి చాలా ప్రీతికరమైనటువంటి తిథి నక్షత్రాలలో ఏకాదశి. ఈ తిథి నెలలో రెండుసార్లు వస్తుంది.

ఒకసారి పార్వతీదేవి పరమశివుని దగ్గర శివరాత్రి గురించి ఆడుగుతుంది. అప్పుడు శివుడు శివరాత్రి ఉత్సవం తనకెంతో ఇష్టమనీ , ఇంకేమి చేయకుండా ఆ రోజు ఒక్క ఉపవాసమున్నాసరే తానెంతో సంతోషిస్తానని చెబుతాడు. ఆయన చెప్పిన దాని ప్రకారం , ఆ రోజు పగలంతా నియమనిష్ఠతో ఉపవాసంతో గడిపి , రాత్రి నాలుగు జాముల్లోనూ శివలింగాన్ని మొదట పాలతో , తర్వాత పెరుగుతో , ఆ తర్వాత నేతితో , ఆ తర్వాత తేనెతో అభిషేకిస్తే శివునికి ప్రీతి కలుగుతుంది. మరునాడు బ్రహ్మవిధులకు భోజనం పెట్టి తాను భుజించి శివరాత్రి వ్రత సమాప్తి చేయాలి. దీనిని మించిన వ్రతం మరొకటి లేదంటాడు పరమశివుడు. మామూలుగానైతే ఏ మాసమైనా కృష్ణపక్ష చతుర్దశిని శివరాత్రిగా భావిస్తారు. కానీ , ఫాల్గుణ మాసపు చతుర్దశికి ప్రత్యేకమైన మహత్తు ఉంటుంది. అందుకే శివరాత్రిని ఆ రోజున బ్రహ్మాండంగా చేసుకుంటారు. మహాశివుడంటే అందరికి తెలుసు. కాని , రాత్రి అంటే ప్రత్యేకార్థము చాల మందికి తెలియదు. “రా” అన్నది దానార్థక ధాతు నుండి “రాత్రి” అయిందంటారు. సుఖాన్ని ప్రదానం చేసేదాన్నే రాత్రి అంటారు. ఋగ్వేద – రాత్రి సూక్తం తాలూకు యూప మంత్రంలో రాత్రిని ప్రశంసిస్తూ ఇలా చెప్పబడింది – హే రాత్రే !

అక్లిష్టమైన తమస్సు మా దగ్గరికి రాకుండుగాక !… వగైరా

‘ఉప మాపేపిశత్తమః కృష్ణం వ్యవక్తమస్థిత్!

ఉష ఋణేవ యాతయ||’

నిజంగానే రాత్రి ఆనందదాయిని అన్నింటికి ఆశ్రయం ఇవ్వగలది. అందుకే రాత్రిని ప్రశంసించటం జరిగింది. మహాశివరాత్రి వ్రతాన్ని రాత్రిపూటే జరుపుకుంటారు. అందువల్ల కృష్ణపక్ష చతుర్దశి రోజు వచ్చిన రాత్రికి ఓ ప్రత్యేకత వుంది. చతుర్దశి రోజు ఎవరైతే శివపూజను చేస్తారో , ఆ రాత్రి జాగరణ వహిస్తారో వారికి మళ్ళీ తల్లి పాలు తాగే అవసరం రాదు. అంటే ఆ భక్తుడు జీవన్ముక్తుడు అవుతాడని స్కందపురాణంలో స్పష్టంగా చెప్పబడింది. అంతటి మహిమాన్వితమైనది శివపూజ.

‘శివంతు పూజయత్వా యోజా గర్తిచ చతుర్దిశీం!

మాతుః పయోధర రసం నపిబేత్ స కదాచన!!’

అందుకేనేమో గరుడ , స్కంద , పద్మ అగ్ని మొదలైన పురాణాల్లో దీనిని ప్రశంసించడం జరిగింది. వర్ణనలలో కొంత తేడా వుండొచ్చు. ప్రముఖ విషయం ఒకటే. ఏ వ్యక్తి అయితే ఆ రోజు ఉపవాసం చేసి , బిల్వ పత్రాలతో శివపూజ చేస్తారో , రాత్రి జాగరణ చేస్తారో వారిని శివుడు నరకాన్నుండి రక్షిస్తాడు. ఆనందాన్ని , మోక్షాన్ని ప్రసాదిస్తాడు. వ్రతం చేసే వ్యక్తి శివమయంలో లీనమైపోతాడు. దానము , తపము , యజ్ఞము , తీర్థయాత్రలు , వ్రతాలు లాంటివెన్ని కలిపినా మహాశివరాత్రికి సరితూగలేవు. మహాశివరాత్రి రోజు ఉపవాసము , జాగరణ శివపూజ ప్రధానమైంది. అసలు వీటికి తాత్విక అర్థాలెన్నో ఉన్నాయి. అసలు వ్రతం గురించి భిన్న భిన్న గ్రంథాల్లో భిన్నార్థలు గోచరిస్తున్నాయి. వైదిక సాహిత్యంలో దీని అర్థం – వేద బోధితమని , ఇష్ట ప్రాపకర్మ అని వుంది. దార్శనిక గ్రంథాల్లో *‘అభ్యుదయ ‘ మని , ‘ నిః శ్రేయస్సు ‘ కర్మ అని , అమరకోశంలో వ్రతమంటే నియమమని వుంటే పురాణాల్లొ మాత్రం ధర్మానికి పర్యాయవాచిగా ఉపయోగించబడింది. అన్నింటిని కలుపుకుంటే – వేదబోధిత అగ్నిహోత్రాది కర్మ , శాస్త్ర విహిత నియమాది , సాధారణ లేక అసాధారణ ధర్మమే వ్రతమని చెప్పవచ్చు. సులభంగా చెప్పుకోవాలంటే కర్మ ద్వారా ఇష్ట దేవుడి సామీప్యాన్ని పొందటమే అని అనవచ్చు.

మహాశివరాత్రి వ్రతం రోజు ఉపవాసానికి చాలా ప్రాముఖ్యత నిచ్చారు. అలా అని ‘తిథితత్వం’ లో చెప్పబడింది. ఈ గ్రంథంలో భగవాన్ శంకరుడు ఇలా అన్నట్లు వుంది.

‘ మీరు స్నానం చేసినా , మంచి వస్త్రాలు ధరించినా , ధూపాలు వెలిగించినా , పూజ చేసినా , పుష్పాలంకరణ చేసినా వీటన్నిటికంటే కూడా ఎవరైతే ఉపవాసం చేయగలరో వారంటేనే నాకిష్టం’ అంటాడు శివుడు.

ఉపవాసం అంటే ఏమిటి ?

దగ్గర వసించటం , నివశించటం , ఉండటాన్ని ఉపవాసమంటారు. వ్రతం చేసేవారి ఇష్టదైవం దగ్గర ఉండటమే ఉపవాసం – ఉపవాసమంటే ఇంతేనా అని పెదవి విరిచే వారికోసమే ఈ శ్లోకం.

‘ఉప – సమీపే యో వాసః జీవాత్మ పరమాత్మనోః

ఉపవాసః సవిఘ్నేయ సర్వభోగ వసర్జిత్: ||’ (వరాహోపనిషత్తు)

భవిష్య పురాణంలో కూడా అలాగే చెప్పబడింది.

ఉపావృత్తస్య పాపేభ్యోయస్సు వాసో గుణైః సహా!

ఉపవాసః స విఘ్నేయ సర్వభోగ వివర్జిత్: ||

మహాశివరాత్రి వ్రతంలో జాగరణ అవసరము. వ్రతానికి యోగ్యమైన కాలము రాత్రి. ఎందుకంటే రాత్రిపూట భూత , శక్తులు , శివుడు తిరిగే సమయమన్నమాట. చతుర్దశి రాత్రి ఆయనను పూజించాలి. భగవాన్ శ్రీకృష్ణుడు గీతలో ఇలా స్పష్టంగా చెప్పాడు. *‘సమస్త ప్రాణుల నిగ్రహ పురుషుడు రాత్రి కాలంలో మేల్కొని తిరుగుతుంటాడు. అతనిలోని ప్రాణులన్నీ జాగృతంగా ఉంటాయి. అంటే భోగ , సంగ్రహంలో మునిగి ఉంటారు. తత్వాన్ని అర్థం చేసుకోగల మునులు దృష్టిలో రాత్రి అది.

‘యానిశా సర్వ భూతానం తస్యాం జాగర్తి సమ్యమీ

యస్యాం జాగృతి భూతాని సానిశాపశ్యతో మునే ‘

విషయాసక్తుడు నిద్రలో వుంటే అందులో నిగ్రహస్తుడు ప్రబుద్ధంగా ఉన్నాడు. అందువల్ల శివరాత్రి రోజు జాగరణ ముఖ్యమన్నమాట. శివునితో ఏకీకరణమవటమే నిజమైన శివ – పూజ. ఇంద్రియాభిరుచుల్ని నిరోధించి పూజించటమే శివవ్రతము.

శివరాత్రి ఎలా చేసుకోవాలంటే – గరుడ పురాణంలో ఇలా వుంది – త్రయోదశి రోజునే శివ – సన్మానము గ్రహించి , వ్రతులు కొన్ని ప్రతిబంధకాల్ని గమనించాలి. అంటే కొన్ని నియమాల్ని మనసులో నిర్ధారించుకుని పాటించాలి. మీ ప్రకటన ఇలా ఉండాలి –

‘హే మహాదేవా ! నేను చతుర్దశి రోజు జాగరణ చేస్తాను. నా భక్తి సామర్ధ్యాన్ని బట్టి దాన , తప , హోమాన్ని చేయగలను. నేను ఆ రోజు నిరాహారిగా ఉంటాను. రెండవరోజు మాత్రమే తింటాను. ఆనంద , మోక్షాలను అనుగ్రహించు శివా !”

వ్రతం చేశాక గురువు దగ్గరికి వెళ్ళాలి. పంచామృతంతో పాటు పంచగవ్యాలును (ఆంటే అయిదు విధములైన గో సంబంధిత వస్తువులు – ఆవు పేడ – ఆవు పంచకం , ఆవుపాలు , ఆవు పెరుగు , ఆవునెయ్యి) శివలింగాన్ని అభిషేకం చేయించాలి. అభిషేకం చేస్తున్న సమయంలో ‘ఓం నమః శివాయ‘ అనుకుంటూ జపించాలి. చందన లేపనంతో ప్రారంభించి అన్ని ఉపాచారాలతో పాటూ శివపూజ చేయాలి. అగ్నిలో నువ్వులు , బియ్యము , నెయ్యితో కలిపిన అన్నము వేయాలి. ఈ హోమం తర్వాత పుర్ణాహుతి నిర్వహించాలి. అందమైన శివకథలు వినవచ్చు. వ్రతలు మరోకసారి రథరాత్రి మూడవ , నాల్గవ ఝాములో ఆహుతులను సమర్పించాలి. సూర్యోదయం అయ్యేంతవరకూ మౌన పాఠం చేయదలచినవారు ‘ఓం నమః శివాయ అంటూ భగవాన్ శివుని స్మరిస్తూ ఉండాలి. ఆయనను భక్తులు కోరుకునేది ఏమిటంటే – *’పరమాత్మా ! మీ అనుగ్రహంతో నేను నిర్విఘ్న పూజ కొనసాగించి పూర్తి చేసాను. హే లోకేశ్వరా ! శివ – భవా ! నన్ను క్షమించు. ఈ రోజు నేను అర్జించిన పుణ్యమంతా , మీకు అర్పితం గావించినదంతా మీ కృపతోనే పూర్తి చేశాను. హే కృపానిధీ ! మా పట్ల ప్రసన్నులు కండి ! మీ నివాసానికి వెళ్ళండి. మీ దర్శనమాత్రము చేతనే మేము పవిత్రులం అయ్యాము.

అటు తర్వాత శివ భక్తులకు భోజనము. వస్త్ర , ఛత్రములు ఇవ్వాలి. నిజానికి లింగోద్భవమైన అర్థరాత్రి సమయం ప్రతిరోజూ వస్తుంది కనుక ప్రతిరోజూ శివరాత్రే. ప్రతిక్షణం శివస్మరణయోగ్యమే. అయితే కృష్ణపక్ష చతుర్దశి శివునికి ఇష్టమైన రోజు కనుక ప్రతినెలా వచ్చే ఆ రోజును మాసశివరాత్రి అన్నారు. అందులోనూ మాఘ బహుళ చతుర్దశి ఆయనకు మరీ మరీ ప్రీతి కనుక ఆ రోజున మహా శివరాత్రి జరుపు కుంటున్నాం. ఆ రోజు ఉదయం స్నానాదికాలం తర్వాత వీలైన శివాలయాన్ని దర్శించి , అవకాశం లేకపోతే , ఇంటివద్దే ఉమామహేశ్వరులను శివప్రీతికరమైన పువ్వులతో , బిల్వదళాలతో అర్చించాలనీ , శక్తికొలదీ పాలు , గంగోదకం , పంచామృతాదులతో లింగాభిషేకం చేయాలనీ , ఉపవాస , జాగరణ శివస్మరణలతో రోజంతా గడిపి మరునాడు ఉత్తమ విప్రులకు , శివభక్తులకు భోజనం పెట్టాలని వ్రత విధానన్ని బోధించారు.

శివరాత్రికి లింగోద్భవకాలమని   కూడా పేరు. ఆ రోజు అర్థరాత్రి జ్యోతిర్మయమైన ఒక మహాలింగంగా శివుడు ఆవిర్భవించాడు. పరమేశ్వరుడు లోకానికి తన స్వరూప దర్శనం చేయించి జగత్తంతా దేదీప్యమానం చేసిన ఆ సమయంలో మనం నిద్రపోవడంలో అర్థం లేదు. అందుకే శివరాత్రి జాగరణకు అంత ప్రాధాన్యం. ఆ రోజు అభిషేకాదులతో శివుని పూజించి ఉపవాసముండి రోజంతా శివనామస్మరణంతో గడపడంలోని ఉద్దేశం మన తనువునూ , మనసునూ కూడా శివార్పితం , శివాంకితం చేయడానికే. శివమంటే జ్ఞానమే. జన్మ పరంపర శృంఖాలాలను తెంచి నిత్యానంద ప్రదమైన మోక్షాన్ని అందించే శక్తి ఆ జ్ఞానానికే ఉంది. శివరాత్రినాడు పధ్నాలుగు లోకాలలోని పుణ్యతీర్థాలు ‘బిల్వ’ మూలంలో ఉంటాయనీ , శివరాత్రినాడు ఉపవసించి ఒక్క బిల్వమైన శివార్పణ చేసి తరించమని శాస్త్రం చెబుతోంది. కనీసం జన్మకొక్క శివరాత్రి అయినా చేయమని పెద్దలు చెబుతుంటారు. సమస్త ప్రాణికోటిలో సూక్ష్మజ్యోతిరూపంలో ఉండే శివుడు భూమిపై పార్థివలింగంగా ఆర్చింపబడుతుంటాడు. శివరాత్రినాడు ఫలం , ఒక తోటకూర కట్ట అయినాసరే శివార్పణం అని దానం చేయడం ముక్తిదాయకం. కలిగినవారు వారి వారి శక్తి అనుసారం బంగారం , వెండి కుందులలో ఆవునేతి దీపం వెలిగించి ఓ పండితునికి సమర్పిస్తే అజ్ఞానంధకారం నశిస్తుందని పెద్దలవాక్కు. శివరాత్రినాడు ఉపవసించి త్రికరణ శుద్ధిగా శివుని ఆరాధిస్తే , ఒక సంవత్సర కాలం నిత్యం శివార్చన చేసిన ఫలం కలుగుతుందని సాక్షాత్తు శంకరుడు బ్రహ్మదేవునికి చెప్పినట్లు పెద్దలవాక్కు.

ప్రదక్షణ విధులు

శివాలయములో ప్రవేశించిన తర్వాత నందికి ఏ ప్రక్కనుంచి లోపలకు వెళ్తారో ఆ ప్రక్కనుంచి మాత్రమే , వెనక్కి రావాలి. శివలింగం , నందీశ్వరుల మధ్య నుంచి రాకూడదు. ఇలావచ్చినా పుణ్యం రాదు సరి కదా పూర్వ జన్మలోని పుణ్యం కూడా పోతుంది.

బిల్వ దళం ప్రాముఖ్యత:

బిల్వం లేదా మారేడు దళం అంటే శివుడికి మహా ఇష్టం. బిల్వ దళం మూడు అకుల్ని కలిగి ఉంటుంది. ఇందులో కుడి ఎడమలు విష్ణు , బ్రహ్మలైతే మధ్యలో ఉండేది శివుడు. మారేడుకే శివప్రియ అని మరోపేరు ఉంది. బిల్వదళం పొరబాటున కాలికి తగిలితే ఆయష్షు క్షీణిస్తుందంటారు. ఇది శివుడి అజ్ఞ. బిల్వం ఇంటి అవరణంలోని ఈశాన్యంలో ఉంటే ఐశ్వర్యం. తుర్పున ఉంటే సౌఖ్యం. పశ్చి మాన ఉంటే సంతానాభివృద్ధి. దక్షినాన ఆపదల నివారణ. వసంతం , గ్రీష్మంలో బిల్వంతో శివున్ని పూజిస్తే అనంతకోటి గోదాన ఫలితం కలుగుతుంది. 

శివరాత్రి జాగరణ, ఉపవాసం ఎంత మహిమాన్వితమైనవో తెలుసా..

శివరాత్రి భారతీయులకు ఎంతో ప్రత్యేకమైన దినం. ఈరోజు ప్రతి శివాలయంలో శివోహం అనే మాటలతో భక్తి పారవశ్యంలో మునిగిపోతారు జనులందరూ. ప్రతి చోటా శివాభిషేకాలు, శివపార్వతుల కళ్యాణం, పురాణాల పారాయణ, పురాణ శ్రవణం.. మొదలైనవి అన్నీ చాలా వైభవంగా జరుగుతాయి. నిరాడంబరుడు అయిన శివుడు శివరాత్రి ఎంతో గొప్పగా పూజలు అందుకుంటాడు. ఇకపోతే శివరాత్రి రోజు ఉపవాసం, జాగరణకు చాలా ప్రాముఖ్యత ఉంది. శివరాత్రి రోజు చేసే ఉపవాసం, జాగరణలు ఎంత శక్తివంతమైనవో తెలిపే ఒక పురాణ కథ ఉంది. దాని గురించి తెలుసుకుంటే..

గుణనిధి అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఇతను పుట్టడానికి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినా ఇతనికి ఏ ఆచారాలు పాటించక చాలా నిర్లక్ష్యంగా ఉండేవాడు. అతనికి లేని చెడ్డ అలవాటు అంటూ లేదు.. ఏ రకంగా చూసినా అతను బ్రాహ్మణ కులాన్ని బ్రష్టు పట్టించాడు అనే వారు. ఇంత చెడ్డ అలవాట్లు కలిగిన గుణనిధి ఒక శివరాత్రి రోజు తన ప్రమేయం లేకుండానే తనకు ఎక్కడా ఆహారం దొరకక ఆ రోజంతా ఏమీ తినకుండా ఉన్నాడు. అతను అలా తినకపోయేసరికి అదే శివరాత్రి ఉపవాసం అయ్యింది.

ఆహారం ఎక్కడా దొరకకపోవడంతో అతనికి ఒక ఆలోచన వచ్చింది. ఈ రోజు శివరాత్రి కదా.. కనీసం గుడిలో ప్రసాదం దొరుకుతుందేమో అని శివాలయానికి వెళతారు. చీకటిలో ఏదైనా తినడానికి వెతుకుదామని అతను దీపం వెలిగిస్తాడు. -అదే శివాలయంలో కొందరు భక్తులు జాగారం చేస్తుండటం అతను గమనించి భయపడతాడు. అక్కడే బిక్కుబిక్కుమని దాక్కుని నిద్రలేకుండా గడుపుతాడు. అక్కడి నుండి పారిపోవాలని ప్రయత్నించి ఊహించని విధంగా ఆ శివాలయంలోనే ప్రాణాలు పోగొట్టుకుంటాడు. అతని ప్రమేయం లేకుండానే ఉపవాసం, జాగరణ ఉండటమే కాకుండా.. శివాలయంలోనే ప్రాణాలు పోగొట్టుకోవడంతో అతని పాపాలన్నీ నశించి శివసాయుజ్యం పొందుతాడు. అంతేనా.. ఆ నాడు శివాలయంలో మరణించిన గుణనిధి మరుసటి జన్మలో నిధులకు అధిపతి అయిన కుబేరునిగా జన్మిస్తాడు. తెలియక శివరాత్రి జాగరణ, ఉపవాసం చేసినందుకే శివుడు ఇంత కరుణ చూపిస్తే.. భక్తి శ్రద్దలతో శివరాత్రి జాగరణ చేస్తే ఆ పరమేశ్వరుడు ఇంకెంత కరుణ చూపిస్తాడో ఎవ్వరూ ఊహించలేరు. అందుకే శివరాత్రి ఉపవాసం, జాగరణ అనేవి జన్మ పాపాలను, చెడు కర్మల పాపాలను కరిగించేవి.. వాటిని అందరూ విదిగా పాటిస్తే ఎంతో మంచిది. 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

శివలింగం పై కిరణాభిషేకం

👉🏻చోళుల కాలం లో నిర్మిత మైన అతి పురాతన శివాలయం

👉🏻సూర్యాస్త సమయములో శివలింగం పై భానుడి కిరణాభిషేకం

👉🏻మహా శివరాత్రి కి ఈశ్వరుడే కొలువై ఉన్న దేవాలయం

👉🏻సూర్య భగవానుడు ఆకాశం నుండి దిగివచ్చి తన కిరణాలతో అభిషేకం చేసే దేవాలయం

👉🏻మన దేశంలో నే అరుదైన, అతి పురాతన, విశిస్టమైన దేవాలయం

👉🏻కోరిన వెంటనే కోర్కెలు తీర్చే దేవాలయం

అయ్యగార్లపల్లి:

అరసవల్లి లో ఉదయ సమయాన సూర్యకిరణాలు సూర్యదేవాలయంలోని విగ్రహం పై పడటం చూశాం, కానీ సూర్యాస్త సమయములొ సూర్యకిరణాలు శివలింగంపై పడే శివాలయం ఉండటం చాలా అరుదు.

ఇలాంటి శివాలయము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజక వర్గం శెట్టూరు మండలంలోని అయ్యగార్లపల్లి గ్రామములో చోళుల కాలం లో నిర్మతమైన అతి పురాతన, విశిస్టమైన శివలయం ఉంది, ఈ శివలయం విశిష్టత పడమర ముఖద్వారం కలిగి నిర్మితమైనది. శివునికి ఇష్టమైన మాఘ మాసం మహా శివరాత్రి పర్వదినాన సాయంకాలయం సంధ్య సమయమున 5:30 pm గంటలనుండి 6 గంటల మధ్యలో సూర్య కిరణాలూ రెండు ద్వారాలు దాటుకొని గర్భాలయం శివలింగం పై పడటం తిలికించవచ్చు, మహా శివరాత్రి రోజున ఆ నీల కంటుడు,ఆ పరమేశ్వరుడు స్వయానా కొలువై ఉంటాడు, అది గమనించి సూర్య భగవానుడు తన కిరణాలతో శివింగం పై కిరనాభిషేకం చేస్తాడు, ఆ సమయమున పరమేశ్వరుడు సూర్య భగవానుడి కిరనాభిషేకానికి పరవశించి పోయి సజ్యోజాతకుడు గా భక్తులు ఏమి కోరిన వెంటనే నెరవేర్చి వారి కష్టాలు తొలగటం ఇక్కడి విశేషం .అందుకనే శివభక్తులు మహాశివరాత్రి పర్వదినాన మన రాష్ట్రమే కాక కర్ణాటక రాస్త్రం నుండి కూడా ఆదికసంఖ్యలో శివ భక్తులు కిరనాభిషేకం ను దర్శించుకొని తన్మయత్వం పొందుతారు.

మహా శివరాత్రికి కిరణాభిషేక దర్శనం భాగ్యం కోటి జన్మల పుణ్యఫలం

ఓం నమో శివాయ

గురుబోధ :

మారేడుచెట్టు శివుని స్వరూపమే. శివునికీ, బిల్వవృక్షానికీ తేడా లేదు. అందుకే దేవతలు కూడా ఈ చెట్టును అతిభక్తితో స్తుతిస్తారు.

ఈ చరాచర జగత్తులో ప్రసిద్ధికెక్కిన ఎన్ని పుణ్యతీర్థాలున్నాయో అవన్నీ మారేడుచెట్టు మూలంలో (వ్రేళ్ళలో) ఉంటాయి.

మారేడుచెట్టు మూలంలో లింగం ఒకదానిని కాని లేదా అనేక లింగాలను కాని ఉంచి పూజించినవాడు పరమపుణ్యాత్ముడౌతాడు.

శివుని సన్నిధిని పొందగలుగుతాడు.

మారేడుచెట్టు క్రింద స్నానం చేసినవాడు, సమస్త పుణ్యతీర్థాలలో స్నానం చేసిన మహాఫలం పొంది, పవిత్రుడౌతాడు.

గంధపుష్పాదులతో మారేడుచెట్టు మొదలును పూజించినవాడు శివలోకంలో శాశ్వతంగా ఉండగలుగుతాడు.

మారేడుచెట్టు దగ్గర దీపం వెలిగించిన పుణ్యాత్ముడై, తత్త్వజ్ఞానం పొందుతాడు. శరీరం విడిచిపెట్టాక శివుడిలో ఐక్యం అవుతాడు.

అందునా, కార్తిక మాసం లోనూ, మాఘ మాసం లోనూ, ప్రతి మాసశివరాత్రికీ, మారేడు దగ్గర ఆవునేతిదీపం వెలిగించినవాడికి ఈ జన్మలోనే కైవల్యం లభిస్తుంది.

ప్రశ్నలకు సమాధానాలు:

ప్రశ్న : శివలింగమును నుదుటికి తగిలించవచ్చా?

జవాబు : శివలింగమును నుదుటికి తాకించవచ్చు. ప్రతిష్ఠించిన లింగములను అభిషేకం చేసాక నుదుటికి తాకించాలి.

చర లింగమును అభిషేకం చేసాక తుడిచి ఒక్కసారి తలమీద (సహస్రార కమలం) పై తాకించుకోవాలి.

ఇలా చేయడం వల్ల ఆ క్షణం నుండి అపూర్వ జ్ఞానం పొందుతారు.

ఇలా స్త్రీ పురుషాదిభేదం లేకుండా ఎవరైనా చేయవచ్చు.

ప్రశ్న : శివపూజ చేసేటప్పుడు భస్మమును శివలింగమునకు రాస్తాము. ఈ భస్మము ఎన్ని రకములు?

జవాబు : భస్మము 3 రకములు:_

1. _లోకాగ్నిజము: ఇంట్లో దీపంతో పేడను కాల్చి చేసే భస్మము.

2. వేదాగ్నిజము:_ అగ్నిని వెలిగించేప్పుడు వేద మంత్రములతో యజ్ఞములో వ్రేల్చి చేసిన భస్మం.

  1. శివాగ్నిజము: శివనామస్మరణతో బిల్వ పత్రములో, దర్భలో, పిడకలో కాల్చి చేసే భస్మము.

ఇందులో వేదాగ్నిజము చాలా ఉత్తమమైనది…

ఈరోజు శనివారం పాటించాల్సిన నియమాలు:-

ఈరోజు గోళ్ళు తీసినట్లయితే శరీరపీడా, దుర్వార్తాశ్రవణం.

ఈరోజు తలంటు తలస్నానం చేసినట్లయితే ఆయుర్వృద్ధి, వస్తుసేకరణ, లాభం మరియు శుభం.

ఈరోజు క్షౌరము (క్షౌరము చేసుకోవడం పనికి రాదు) చేసుకున్నట్లయితే 07 నెలలు ఆయుక్షీణం కలుగుతుంది, రోగం వృధ్ధీ చెందుతుంది,

(రోజు చేసుకునే వారికి వర్తించదు.)అశుభం.

ఈరోజు వృషభ రాశి, సింహ రాశి వారికి, కన్యా రాశి వారికి ఘాతవారం కనుక వారు నూతన వస్త్రాలు వేసూకోవడం ప్రయాణం (యాత్రలు) చేయడం, నూతన పనులు ప్రారంభం లాంటివి పనులు చేయకుంటే మంచిది.

శ్రీ శని స్తుతి

నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం,

ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరమ్!!

ప్రయాణపు శూల:-
శనివారంనాడు ప్రయాణాదులకు తూర్పు దిశ పనికిరాదు.

ఒకవేళ తప్పనిసరై వెళ్ళాల్సొస్తే ముందుగా పెరుగు లేదా జీలకర్ర నోట్లో వేసుకుని ఆ తరువాత మాత్రమే బయలుదేరాలి.

అదేసమయంలో ఈరోజు దక్షిణదిశగా ప్రయాణిస్తే సత్ఫలితాలు పొందవచ్చు!

శనివారం గ్రహాధిపతి “శనైశ్చరుడు” మరియు “రాహువు” 

శనైశ్చరుని అధిష్టాన దైవం “శ్రీ బ్రహ్మ దేవుడు”, మరియు “శ్రీ యమధర్మ రాజు”.  శనైశ్చరుని అనుగ్రహం కొరకు శనివారం నాడు స్మరించవలసిన మంత్రాలు:

  1. ఓం శనైశ్చరాయ నమః ||
  2. ఓం బ్రహ్మణే నమః ||
  3. ఓం యమాయ నమః ||

4. ఓం విష్ణవే నమః || 

శనైశ్చరుని అనుగ్రహం కొరకు

శనివారాల్లో  శ్రీ మహా విష్ణు ఆలయాన్ని, శ్రీ హనుమాన్ ఆలయాన్ని,  సందర్శించండి. 
శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం,

శ్రీ హనుమాన్ చాలీసా పఠించండి.

రాహువు యొక్క అధిష్టాన దైవం

శ్రీ దుర్గా దేవి, మరియు నాగ (సర్ప) దేవతలు.  రాహువు అనుగ్రహం కొరకు శనివారం నాడు స్మరించవలసిన మంత్రాలు:

  1. ఓం రాహవే నమః ||
  2. ఓం దుం దుర్గాయై నమః ||

3. ఓం సర్పేభ్యో నమః ||

రాహువు యొక్క అనుగ్రహం కొరకు

శనివారాల్లో శ్రీ దుర్గ మాత ఆలయాలను రాహుకాలంలో (ఉదయం 9.00 నుండి 10.30 మధ్య) సందర్శించండి.

  శ్రీ దుర్గ సప్త శ్లోకి స్తోత్రం, శ్రీ దుర్గ సూక్తం పఠించండి.

శనివారం వికలాంగులకు, పెద్దలకు సేవ మరియు దాతృత్వం చేయాల్సిన రోజు. ఇనుము, భూమి, వ్యవసాయం, గృహ నిర్మాణం, యోగా, ధ్యానానికి సంబంధించిన పనులు చేయండి.

ముఖ్యమైన పనులు ప్రారంభించకూడదు. ఇతరులను నిందించడం, జుట్టు మరియు గోళ్లు కత్తిరించడం వంటివి చేయకండి.

గ్రహ బలం కొరకు, శనివారం నలుపు, ముదురు నీలం మరియు ఇతర ముదురు రంగు దుస్తులు ధరించండి.

శనివారం తలకు నూనె రాసుకుని తలంటు స్నానం చేస్తే, ఆయుష్షు పెరుగుతుంది, కుటుంబ సౌఖ్యం కలుగుతుంది, వస్తు వాహనాలు లభిస్తుంది, ప్రతి పనిలో శుభం చేకూరుతుంది. 

తెల్లని అన్నంతో చిన్న సైజు శివలింగాన్ని చేసి(లేదా పాదరస,లేదా స్పటిక లింగం) కింద ఇచ్చిన మంత్రాలతో దానికిపూజ చెయ్యండి,ఎప్పుడూ డబ్బుకు ఇబ్బందులు కలుగవు. త్వరలోనే ఆర్థిక స‌మ‌స్య‌లు తీరిపోతాయి.
వీలైతే రేపు శివరాత్రి రోజు(రాత్రి 12 గంటలకైతే మరీ మరీ మంచిది) చెయ్యండి ఆలస్యమైనా పర్లేదు.
ఈ క్రింద ఇచ్చిన 8 నామాలతో ఆ శివలింగానికి పూజ చెయ్పండి చాలు
సహస్రనామాలతో ,రుద్రంతో చేసినంత ఫలితం తప్పక కలుగుతుంది
1) ఓం భవాయ దేవాయ నమః
2) ఓం శర్వాయ దేవాయ నమః
3) ఓం ఈశానాయ దేవాయనమః

4) ఓం పశుపతయే దేవాయ నమః

5) ఓం రుద్రాయ దేవాయ నమః
6) ఓం ఉగ్రాయ దేవాయ నమః
7) ఓం భీమాయ దేవాయ నమః

8) ఓం మహతే దేవాయ నమః

నమ్మకంతో విశ్వాసం తో ఎటువంటి అనుమానము లేకుండా పూజ చేసి(బిల్వ దళాలతో) తరించండి.

శివాయ గురవేనమః


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading