నారద వర్తమాన సమాచారం
హై అలర్ట్.. భాగ్యనగరంలో కట్టుదిట్టమైన భద్రత
భాగ్యనగరంలో హై అలర్ట్ కొనసాగుతోంది. జమ్ముకశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో హైదరాబాద్లో ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. పాతబస్తీలోని చార్మినార్ వద్ద లా అండ్ ఆర్డర్ పోలీసులతో పాటు రాపిడ్ యాక్షన్ ఫోర్స్తో భద్రతను పర్యవేక్షిస్తున్నారు. నల్ల రిబ్బన్లు ధరించి ప్రార్థనలకు హాజరవ్వాలని ముస్లింలకు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పిలుపునిచ్చారు. మరికాసేపట్లో చార్మినార్ మక్కా మసీద్ వద్ద ముస్లింల ప్రార్థనలు ప్రారంభంకానున్నాయి. ఈక్రమంలో చార్మినార్ వద్ద భద్రతను సౌత్ జోన్ డిసిపి స్నేహ మిశ్రా పర్యవేక్షిస్తున్నారు.
మరోవైపు.. పహల్గామ్ ఉగ్రదాడికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అమాయకుల ప్రాణాలు తీసిన ఉగ్రవాదులను అంతమొందించాలంటూ డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ ఉగ్రదాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు న్యాయం చేయాలంటూ దేశ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో నిరసనలు చేపడుతున్నాయి. అలాగే హైదరాబాద్లోని బేగంబజార్లోని వ్యాపారస్తులు నిరసన చేపట్టారు. పహెల్గామ్ టెర్రరిస్ట్ దాడికి నిరసనగా మధ్యాహ్నం వరకు బేగంబజార్ బంద్కు బేగంబజార్ వ్యాపారస్తులు పిలుపునిచ్చారు. టెర్రరిస్టుల చిత్ర పటాలను దహనం చేసి పాకిస్థాన్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వ్యాపారస్తులు భారీగా ర్యాలీ నిర్వహించారు. పాకిస్థాన్ ఎన్ని కవ్వింపు చర్యలు చేసిన భారత్ భయపడే ప్రసక్తే లేదన్నారు. ప్రధాని మోడీకి భారత ప్రజలు అండగా ఉంటారని బేగంబజార్ వ్యాపారస్తులు తెలిపారు. దాడికి పాల్పడిన వారిపై అతి త్వరలో భారత్ ప్రతీకారం తీసుకుంటుందని నమ్మకం ఉందన్నారు. దాడిలో మృతి చెందిన వారికి ర్యాలీగా వ్యాపారస్తులు శ్రద్ధాంజలి ఘటించారు.