నారద వర్తమాన సమాచారం
పాకిస్థాన్ కు ఒక్క చుక్క నీటిని కూడా వెళ్లనివ్వం: కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్
పహల్గామ్ ఉగ్ర దాడి నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం
ఉగ్ర దాడికి వ్యతిరేకంగా ప్రధాని మోదీ పలు ఆదేశాలు జారీ చేశారన్న కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్
సింధూ జలాల ఒప్పందాన్ని రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకమైనదిగా వెల్లడి
పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత ప్రభుత్వం ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకున్న విషయం విదితమే. ఈ క్రమంలో భారత్ నుంచి పాకిస్థాన్కు చుక్క నీరు కూడా వెళ్లనీయమని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ స్పష్టం చేశారు.
ఉగ్రదాడితో నెలకొన్న పరిస్థితులపై శుక్రవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న కేంద్ర మంత్రి పాటిల్ ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఉగ్రదాడికి వ్యతిరేకంగా ప్రధాని మోదీ పలు ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. వాటిని సమర్థవంతంగా అమలు చేస్తామని పేర్కొన్నారు.
ముఖ్యంగా సింధు నదీ జలాల ఒప్పందంలో భవిష్యత్తు కార్యచరణ గురించి ఈ సమావేశంలో చర్చించామని వెల్లడించారు. ఉగ్రదాడులను సహించేది లేదని పాకిస్థాన్కు గట్టి హెచ్చరిక జారీ చేయడం జరిగిందని అన్నారు. సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకమైనదని, ఇది సమర్థనీయమని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.