Saturday, July 19, 2025

ప్రపంచంలోనే అతిపెద్ద అకౌంటింగ్ పవర్ హౌస్ ఐసిఎఐ!.ఐసిఏఐ స్ఫూర్తి మెగా కాన్ఫరెన్స్ లో రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి లోకేష్…!

నారద వర్తమాన సమాచారం

ప్రపంచంలోనే అతిపెద్ద అకౌంటింగ్ పవర్ హౌస్ ఐసిఎఐ!

2047నాటికి 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్

ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధిలో భాగస్వామ్యం వహించండి

పెట్టుబడుల కోసం పోటీపడతాం…

జనవరిలో అమరావతికి క్వాంటమ్ కంప్యూటర్

ఐసిఏఐ స్ఫూర్తి మెగా కాన్ఫరెన్స్ లో రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి లోకేష్

గుంటూరు: ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) అన్నది భారతదేశ మేధోశక్తికి వెన్నెముక లాంటిది. ఐసిఎఐ స్థాపించి 76 సంవత్సరాలు నిండినా ఆ సంస్థ ఇప్పటికీ యవ్వనంగానే ఉంది. ఇది భారతదేశంలో అతిపెద్ద సంస్థగా మాత్రమే కాదు, ప్రపంచంలోనే అతిపెద్ద అకౌంటింగ్ పవర్‌హౌస్ గా ఉందని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. గుంటూరు బండ్లమూడి గార్డెన్స్ లో ఐసిఎఐ గుంటూరు చాప్టర్ ఆధ్వర్యాన “స్పూర్తి” పేరుతో నిర్వహించిన మెగా సిఎ విద్యార్థుల సమావేశానికి లోకేష్ ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ… ఐసిఎఐ ప్రపంచంలోనే అత్యంత గౌరవనీయమైన, విశ్వసనీయ సంస్థగా గుర్తింపు పొందింది. ప్రపంచంలో ఫోరెన్సిక్ అకౌంటింగ్ ప్రమాణాలతో పనిచేస్తున్న మొట్టమొదటి సంస్థ ఇది. ఐసిఎఐ ద్వారా 10లక్షలమందికి పైగా చార్టర్డ్ అకౌంటింగ్ విద్యను అభ్యసిస్తుండగా, ప్రతిఏటా 2లక్షలమంది పరీక్షలు రాస్తున్నారు. 4.07 లక్షల మంది సభ్యులు, 54 విదేశీ చాప్టర్లు కలిగిన అతిపెద్ద సంస్థ ఐసిఎఐ. వ్యాపారం ఎక్కడ ఉంటే భారత్ అక్కడ ఉంటుంది, భారత్ ఎక్కడ ఉంటే అక్కడ ICAI ఉంటుంది.

సిఎ కోర్సు నిబద్ధతతో కూడుకున్న విద్య

భారతదేశం గర్వించదగిన ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) కుటుంబసభ్యులు అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. నేను చార్టర్డ్ అకౌంటెంట్ కాకపోయినా స్టాన్ఫోర్డ్ ఎంబీఏ గ్రాడ్యుయేట్ గా సిఎ ప్రాధాన్యత నాకు తెలుసు. ఇది కేవలం ఒక కోర్సు కాదు, నిబద్ధత కూడుకున్న విద్య.
మా కుటుంబ వ్యాపారాల్లో సిఎల కష్టాన్ని నేను ప్రత్యక్షంగా చూశాను. వ్యాపారాల్లో స్పష్టత లోపించినపుడు మేము సిఎ వైపే చూస్తాము. పాలనా వ్యవస్థలో బడ్జెట్ ఆమోదం ఉన్న ప్రతి ప్రభుత్వ ఫైల్‌కు ఆడిటర్ల ఆమోద ముద్ర అవసరం. వ్యవస్థపై నమ్మకం కోసం మేము చార్టర్డ్ అకౌంటెంట్‌పై ఆధారపడతాం. సీఏలు కేవలం సంఖ్యా విశ్లేషకులు మాత్రమే కాదు, వారు ఆర్థిక వృద్ధి చోదకులు. వారు వ్యాపారాలకు మూలధనాన్ని సేకరించడానికి, ఉద్యోగాలను సృష్టించడానికి సహాయం చేస్తారు. సేకరించిన ప్రతి రూపాయి, సృష్టించబడిన ప్రతి ఉద్యోగం కథలో సీఏ పాత్ర ఉంటుంది. మా ప్రభుత్వం సీఏల ఇన్‌పుట్‌లకు విలువ ఇస్తుంది, పాలనా నిర్ణయాలలో మేము సీఏలను సంప్రదిస్తాము. మీరు బ్యాలెన్స్ షీట్‌లను మాత్రమే ధృవీకరించరు, రాష్ట్ర ఆర్థిక వెన్నెముకను తయారు చేస్తారు. న్యూ ఏజ్ సీఏ అనేది కాలిక్యులేటర్ కంటే ఎక్కువ.
నేటి సీఏలు అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, ప్రపంచవ్యాప్తంగా అవగాహన, AI ఆధారిత కమ్యూనికేషన్, నైతికత కలిగి ఉండాలి.

చార్టర్డ్ అకౌంటెంట్స్ ఫ్యాక్టరీ గుంటూరు

భారతదేశ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఫ్యాక్టరీ గుంటూరు నగరం. ఆశ్చర్యకరంగా గుంటూరు సిటీ వైద్యులు, ఇంజనీర్లకంటే ఎక్కువగా సిఎలను తయారుచేస్తోంది. డాక్టర్లు, ఇంజనీర్లకంటే సిఎ చదువుతున్న 10వేలమంది విద్యార్థుల సంఖ్య ఎక్కువ.
అత్యుత్తమ ప్రతిభ, అధిక ఉత్తీర్ణత శాతంతో సమున్నత లక్ష్యాలు కలిగిన చార్డర్డ్ అకౌంటెంట్లు గుంటూరుకే సొంతం. గుంటూరు నుండి గల్ఫ్, అమెరికా, ఆస్ట్రేలియా వరకు విస్తరించిన తెలుగు CAలు భారతదేశం గర్వపడేలా ప్రతిభను చాటుతున్నారు.
సిఎ వృత్తిలో ప్రవేశించడం కష్టం, విస్మరించడం అసాధ్యం. సిఎ కోర్సు కష్టతరమైనది అయినప్పటికీ యువతను ఉన్నత శిఖరాల్లో నిలబెడుతుంది. వజ్రాన్ని తయారుచేయడం ఎంతకష్టమో సిఎ డిగ్రీ సాధించడం కూడా అంతే కష్టం.

ఆర్థికాభివృద్ధిలో సిఎల పాత్ర కీలకం

సిఎ వృత్తిపన్నులు, చట్టం, బ్యాంకింగ్, పెట్టుబడులు, సాంకేతికత, విధానం వంటి రంగాల్లో విస్తరించి ఉంది. ప్రతి బ్యాలెన్స్ షీట్ వెనుక ఒక టాలెంట్ బ్రెయిన్ ఉంటుంది. ఆ బ్రెయిన్ పేరే చార్టర్డ్ ఎకౌంటెంట్. వికసిత్ భారత్ లో భాగంగా 2047నాటికి $30 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా అవతరించాలన్నది ప్రధాని మోడీజీ ఆకాంక్ష కాగా, అందులో $2.4 ట్రిలియన్ సాధించాలన్నది ఆంధ్రప్రదేశ్ లక్ష్యం. ఇది కఠినమైనది అయినప్పటికీ అసాధ్యం కాదు. భారతదేశానికి గర్వకారణంగా నిలిచే భవిష్యత్ ఆర్థిక వృద్ధిలో భాగస్వామి కావడం ఎపి బాధ్యతగా భావిస్తోంది. దేశ ఆర్థికాభివృద్ధిలో ఎపి ప్రస్తుత వాటా 4.85% కాగా, 2047 నాటికి 6.67%గా ఉండాలన్నది ప్రభుత్వ లక్ష్యం. గతంలో 10 నుంచి 12శాతం వరకు వృద్ధి రేటు సాధించిన మనం, నిర్ణీత లక్ష్యాన్ని చేరుకోవడానికి భవిష్యత్తులో 15శాతం వరకు వృద్ధిరేటు సాధించాల్సి ఉంటుంది. ఈ మహోన్నత లక్ష్యసాధనలో చార్టర్డ్ అకౌంటెంట్లు కీలకపాత్ర వహించాల్సి ఉంది.

క్వాంటమ్ తో మారనున్న రూపురేఖలు

సౌత్ ఆసియా లోనే మొట్టమొదటి క్వాంటమ్ కంప్యూటర్ జనవరిలో అమరావతిలో ఆవిష్కృతం కాబోతోంది. గతంలో జన్మభూమి, స్వయం సహాయక సంఘాలు, ఇ-గవర్నెన్స్, ఐటీ హబ్‌లతో రాష్ట్ర చిత్రపటాన్ని మార్చేసిన చంద్రబాబునాయుడు… ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీతో ఎపి రూపురేఖలు మార్చబోతున్నారు. మేం మార్పుకోసం వేచిచూడకుండా ఇక్కడ నుంచే మార్పునకు శ్రీకారం చుడుతున్నాం. పెట్టుబడుల కోసం పొరుగు రాష్ట్రాలతో పోటీపడుతున్నాం. అభివృద్ధి కోసం పోటీపడతామే తప్ప…. రాజకీయ ఘర్షణ మా అభిమతం కాదు. అభివృద్ధి వికేంద్రీకరణ విధానంతో ముందుకు వెళ్తున్నాం. కర్నూలులో డ్రోన్ సిటీ, కడపలో స్టీల్ ప్లాంట్, విశాఖలో ఏ ఎన్ ఎస్ ఆర్, సత్వ జిసిసితో పాటు ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంటు రాబోతున్నాయి.

చంద్రబాబు నుంచి స్ఫూర్తి పొందా

నేను విజనరీ లీడర్ చంద్రబాబు నుంచి స్ఫూర్తి పొందాను. ఆయన 75ఏళ్ల వయసులో 25 ఏళ్ల యువకుడిలా పనిచేస్తున్నారు. మాన్యుఫాక్చరింగ్, ఎనర్జీ, ఐటి, ఫార్మా… అన్ని రంగాల్లో ఏపీని నెం.1 గా నిలపాలన్నదే మా లక్ష్యం. రాబోయే మూడేళ్లలో ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ తెచ్చేందుకు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నా. యువత రాజకీయాల్లోకి రావాలి, తెలుగుదేశం పార్టీ యువత, విద్యావంతులను ప్రోత్సహిస్తుంది. మహిళా సాధికారిత ద్వారానే సమాజాభివృద్ధి సాధ్యం. మార్పు మన ఇంటి నుంచే ప్రారంభం కావాలి. 1992లో చంద్రబాబు  ప్రారంభించిన హెరిటేజ్ ను నా తల్లి భువనేశ్వరి, భార్య బ్రహ్మణి సమర్థవంతంగా నిర్మిస్తున్నారు.

సిఎల భాగస్వామ్యంతో అవినీతికి చెక్

నేటి ప్రపంచంలో, ఐక్యూ మంచిది, ఈక్యూ మంచిది. కానీ టిక్యూ (టెక్ కోషెంట్) కూడా తప్పనిసరి. పదునుగా, నైతికంగా, తాజాగా ఉండండి. మీరే మా పెట్టుబడి. లక్ష్యసాధనపై దృష్టి కేంద్రీకరించి, ఆచరణాత్మకంగా, సానుకూలంగా ఉండండి. మీరు ఎంచుకున్న ప్రయాణం కష్టమైందే కానీ మీకు బంగారు భవిష్యత్తు ఉంటుంది. సీనియర్లు, మెంటర్లు, మెరుగైన ఎకోసిస్టమ్ ద్వారా మెళుకువలు నేర్చుకోండి. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని నమ్ముతారు, మేము మిమ్మల్ని నమ్ముతాము. సిఎ ఉత్తీర్ణత సాధించడం కేవలం ఒక మైలురాయి కాదు, ఇది మీ జీవితానికి మణిహారం లాంటిది. నిద్రపోతున్న వారిని మేల్పోల్పండి, దేశాన్ని మేల్కొల్పండి అన్నది ఐసిఎఐ నినాదం. భారతదేశ ఆర్థికవ్యవస్థకు మీరే గుండెకాయ. సిఎలు పాలనా వ్యవస్థలోకి వస్తే అవినీతిని రూపుమాపడం సులభతరమవుతుంది. మనమంతా కలసి భారతదేశాన్ని, ఆంధ్రప్రదేశ్ ను ప్రగతిపథం వైపు నడిపిద్దాం. భవిష్యత్తు మీది, లక్ష్యం మాది, ప్రభుత్వం మీతో ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధికి అవసరమైన విధానాల రూపకల్పనలో సిఎలు భాగస్వాములు కావాలని మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి, ఐసిఎఐ వైస్ ప్రెసిడెంట్ డి.ప్రసన్నకుమార్, సదరన్ ఇండియా రీజనల్ కౌన్సిల్ (SIRC) వైస్ చైర్మన్ ముప్పాళ్ల సుబ్బారావు, గుంటూరు బ్రాంచి చైర్మన్ ఎన్.రాజశేఖర్, సదరన్ ఇండియా చార్టర్డ్ అకౌంటెంట్స్ స్టూడెంట్స్ అసోసియేషన్ (SICASA) గుంటూరు బ్రాంచ్ చైర్మన్ చింతా రఘునందన్, వైస్ చైర్మన్ బి.ఝాన్సీ లక్ష్మి, కార్యదర్శి వనిమిరెడ్డి వి. నరేష్ తదితరులు పాల్గొన్నారు.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version