నారద వర్తమాన సమాచారం
సహాయకుడి హత్యతో ట్రంప్ సంచలన నిర్ణయం
యాంటిఫాను ఉగ్రవాద సంస్థగా ప్రకటించిన డొనాల్డ్ ట్రంప్
తన సహాయకుడు చార్లీ కిర్క్ హత్య నేపథ్యంలో సంచలన నిర్ణయం
యాంటిఫాకు నిధులు ఇచ్చేవారిపై విచారణకు సిఫారసు
ప్రముఖ కన్జర్వేటివ్ కార్యకర్త, టర్నింగ్ పాయింట్ యూఎస్ఏ వ్యవస్థాపకుడు కిర్క్
కిర్క్ హత్య కేసులో నిందితుడికి మరణశిక్ష విధించాలని కోరుతున్న ప్రాసిక్యూటర్లు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన సన్నిహిత సహాయకుడు, ప్రముఖ కన్జర్వేటివ్ నేత చార్లీ కిర్క్ హత్యకు గురైన కొద్ది రోజులకే, వామపక్ష భావజాలం కలిగిన ‘యాంటిఫా’ గ్రూపును ప్రధాన ఉగ్రవాద సంస్థగా అధికారికంగా ప్రకటించారు. దేశంలో పెరుగుతున్న రాజకీయ హింసకు వామపక్ష శక్తులే కారణమంటూ కొంతకాలంగా ఆరోపిస్తున్న ట్రంప్, ఈ నిర్ణయంతో తీవ్ర చర్చకు దారితీశారు.
గురువారం తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘ట్రూత్ సోషల్’లో ట్రంప్ ఈ విషయాన్ని వెల్లడించారు. “యాంటిఫా అనేది ఒక ప్రమాదకరమైన, విపరీత వామపక్ష బృందం. దానిని ఉగ్రవాద సంస్థగా ప్రకటిస్తున్నాను. ఈ సంస్థకు నిధులు సమకూరుస్తున్న వారిపై ఉన్నత స్థాయి చట్టపరమైన విచారణ జరపాలని కూడా గట్టిగా సిఫారసు చేస్తాను” అని ఆయన తన పోస్టులో పేర్కొన్నారు.
ఈ నెల 10న ఉటా వ్యాలీ యూనివర్సిటీలో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రసంగిస్తుండగా చార్లీ కిర్క్ (31) మెడపై కాల్పులు జరిగాయి. ఆసుపత్రికి తరలించినప్పటికీ, చికిత్స పొందుతూ ఆయన మరణించారు. కిర్క్ ‘టర్నింగ్ పాయింట్ యూఎస్ఏ’ (టీపీయూఎస్ఏ) అనే ప్రముఖ కన్జర్వేటివ్ విద్యార్థి సంస్థ వ్యవస్థాపకుడు. 2024 ఎన్నికల్లో యువ ఓటర్లను సమీకరించడంలో ఈ సంస్థ ట్రంప్ ప్రచారానికి కీలక పాత్ర పోషించింది.
కిర్క్ హత్య కేసులో టైలర్ రాబిన్సన్ను ప్రధాన నిందితుడిగా చేర్చిన ఉటా ప్రాసిక్యూటర్లు, అతడిపై హత్యానేరంతో పాటు మరో ఆరు అభియోగాలు నమోదు చేశారు. నిందితుడికి మరణశిక్ష విధించాలని కోరనున్నట్లు వారు ప్రకటించారు. విచారణలో భాగంగా రాబిన్సన్ తల్లి ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం, గతేడాది కాలంగా రాబిన్సన్ రాజకీయంగా వామపక్ష భావజాలం వైపు మొగ్గు చూపుతున్నాడని, స్వలింగ, ట్రాన్స్జెండర్ హక్కులకు మద్దతుదారుగా మారాడని ప్రాసిక్యూటర్లు కోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలో దేశంలో రాజకీయ హింసకు వామపక్ష శక్తులే కారణమని ట్రంప్ తన వాదనలను మరింత బలంగా వినిపిస్తున్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.