నారద వర్తమాన సమాచారం
అక్టోబర్ 14న తెలంగాణ బంద్..
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే విధించడంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై బీసీ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి.
తమకు తీరని అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ, రిజర్వేషన్ల సాధన కోసం ఈ నెల 14వ తేదీన తెలంగాణ బంద్కు పిలుపునిచ్చాయి. ఈ బంద్ కారణంగా ఆ రోజు రాష్ట్రవ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీలు బంద్ అయ్యే అవకాశం ఉండడంతో విద్యార్థులకు మరో సెలవు లభించే సూచనలు కనిపిస్తున్నాయి.
హైదరాబాద్లోని బషీర్బాగ్ ప్రెస్క్లబ్లో శుక్రవారం జరిగిన బీసీ సంఘాల సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం వ్యవస్థాపకుడు ఆర్ కృష్ణయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యంగా రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎన్నికల ప్రకటన విడుదలయ్యాక ఎన్నికల ప్రక్రియను ఆపరాదన్న సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా రెండు వారాల పాటు వాయిదా వేయడం దురదృష్టకరం. ఈ నిర్ణయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని ఆర్ కృష్ణయ్య తెలిపారు.
ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలోని 56 శాతం బీసీ ప్రజల హక్కులకు విఘాతం కలుగుతోంది. బీసీల ఆత్మగౌరవాన్ని రేవంత్ రెడ్డి దెబ్బతీశారు. మా నోటికాడి అన్నం ముద్దను లాక్కున్నారని ఆర్ కృష్ణయ్య అభిప్రాయపడ్డారు.హైకోర్టు ఇచ్చిన స్టేపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని ఆర్ కృష్ణయ్య విజ్ఞప్తి చేశారు.
బీసీ రిజర్వేషన్లు కల్పించలేని పక్షంలో రేవంత్ రెడ్డి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు. ఈ పోరాటాన్ని మండల్ కమిషన్ ఉద్యమం తరహాలో ఉద్ధృతం చేస్తామని ప్రకటించారు. బీసీల్లో చైతన్యం వచ్చిందని, ఊరూరా నిరసనలు, ధర్నాలు, రాస్తా రోకోలు చేపడతామని తెలిపారు. అన్ని సంఘాల ఆధ్వర్యంలో మిలియన్ మార్చ్ తరహాలో అక్టోబర్ 14న రాష్ట్రవ్యాప్తంగా బంద్ జరుగుతుందని వెల్లడించారు.
ఈ తెలంగాణ బంద్కు మద్దతు తెలపాలని ఎంపీలు, ఎమ్మెల్యేలతో సహా ఇతర ప్రజా ప్రతినిధులను ఆయన ఆహ్వానించారు. రాస్తారోకోలతో దేశాన్ని కదిలించేలా బంద్ ఉంటుందని, బీసీల సత్తా ఏంటో చూపిస్తామని ఆర్ కృష్ణయ్య ప్రకటించారు.
బీసీ రిజర్వేషన్ల సాధన కోసం రేపటి నుంచే ఆందోళనలు ప్రారంభిస్తామని ఆయన హెచ్చరించారు. అక్టోబర్ 14న జరగబోయే ఈ బంద్ తెలంగాణలో తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది…
Discover more from
Subscribe to get the latest posts sent to your email.