Monday, March 23, 2026
spot_img

పేదల ముంగిటకే వైద్య సేవలు, ‘మీ ఇంటికి మీ డాక్టర్’ మొబైల్ క్లినిక్‌ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల

నారద వర్తమాన సమాచారం

పేదల ముంగిటకే వైద్య సేవలు, ‘మీ ఇంటికి మీ డాక్టర్’ మొబైల్ క్లినిక్‌ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల

రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ మెదరమెట్ల రామ శేషగిరిరావు ఆధ్వర్యంలో బృహత్తర సేవా యజ్ఞంఆర్.ఈ.సి (REC) ప్రాజెక్ట్ సౌజన్యంతో జిల్లావ్యాప్తంగా ఉచిత వైద్య పరీక్షలు, మందుల పంపిణీ

పల్నాడు జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో నివసించే నిరుపేదలకు నాణ్యమైన వైద్య సేవలను వారి ఇంటి వద్దకే చేరవేసే లక్ష్యంతో ‘మీ ఇంటికి మీ డాక్టర్’ (Mee Intiki Mee Doctor) అనే వినూత్న కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతిక శుక్ల సోమవారం కలెక్టరేట్ ప్రాంగణంలో జెండా ఊపి ఘనంగా ప్రారంభించారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ (IRCS) పల్నాడు జిల్లా శాఖ ఆధ్వర్యంలో, ఆంధ్ర రాష్ట్ర శాఖ సహకారంతో మరియు ఆర్.ఈ.సి (REC) ప్రాజెక్ట్ సౌజన్యంతో ఈ మొబైల్ క్లినిక్ యూనిట్ వాహనాన్ని ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ కృతిక శుక్ల మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేదలకు, ముఖ్యంగా ఆసుపత్రులకు రాలేని వృద్ధులకు, గర్భిణీలకు మరియు చిన్నపిల్లలకు ఈ మొబైల్ క్లినిక్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని పేర్కొన్నారు. శిశు మరణాల రేటు (IMR), మాతృ మరణాల రేటు (MMR) తగ్గించడం మరియు అంటువ్యాధుల నియంత్రణే ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశ్యమని ఆమె వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన జిల్లాల్లో ఆర్.ఈ.సి ఫౌండేషన్ సుమారు ₹8.40 కోట్ల భారీ వ్యయంతో ఈ ప్రాజెక్టును అమలు చేస్తోందని, జిల్లాలో ఈ సేవలు నిరంతరం కొనసాగేలా రెడ్ క్రాస్ ప్రతినిధులు, వైద్య ఆరోగ్య శాఖ సమన్వయంతో పనిచేయాలని సూచించారు.పల్నాడు జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ మెదరమెట్ల రామ శేషగిరిరావు నేతృత్వంలో ఈ బృహత్తర సేవా యజ్ఞం అత్యంత సమర్థవంతంగా రూపుదిద్దుకుంది. జిల్లాలో రెడ్ క్రాస్ సేవలను ప్రతి గ్రామానికి చేరువ చేయడంలో రామ శేషగిరిరావు చూపుతున్న చొరవను అధికారులు మరియు ప్రజలు కొనియాడుతున్నారు. ఆయన మాట్లాడుతూ “వైద్య సదుపాయాలు అందని మారుమూల గ్రామాల ప్రజల కోసం ఈ మొబైల్ యూనిట్ ద్వారా ఒక డాక్టర్, నర్సు, ఫార్మసిస్ట్ మరియు డ్రైవర్‌తో కూడిన బృందం నేరుగా రోగుల వద్దకు వెళ్తుంది. ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించడమే కాకుండా, అవసరమైన మందులను కూడా అక్కడికక్కడే ఉచితంగా అందజేస్తాం” అని తెలిపారు. ప్రజారోగ్య పరిరక్షణలో ఈ మొబైల్ క్లినిక్ ఒక గొప్ప ముందడుగు అని ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు జిల్లా స్థాయి అధికారులు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ ఎం.ఆర్. శేషగిరిరావు , వైస్ చైర్మన్ కే.ఎం.ఎన్.వి. శ్రీనివాస గుప్తా , కోశాధికారి డాక్టర్ నంద్యాల రాంప్రసాద్ రెడ్డి, సెక్రటరీ డాక్టర్ చంద్రశేఖర్ , మేనేజింగ్ కమిటీ సభ్యులు బత్తుల మురళి , విన్సెంట్ పాల్ , డాక్టర్ సృజనా , మరియు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading