

నారద వర్తమాన సమాచారం
మే :19
కిర్గిస్థాన్లో అల్లర్లు : భారత విద్యార్థులకు కేంద్రం అలర్ట్
కిర్గిస్థాన్ దేశంలోని భారతీయ విద్యార్థులను కేంద్రం అప్రమత్తం చేసింది. రాజధాని నగరం బిషెక్లో విదేశీ విద్యార్థులను లక్ష్యంగా చేసుకొని మూక హింస చెలరేగడంతో ఎవరు బయటకు రావొద్దని సూచించింది. ఈ మేరకు అక్కడి మన దేశ రాయబార కార్యాలయం ఎక్స్ వేదికగా పోస్టు పెట్టింది. ‘‘మన విద్యార్థుల గురించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాం. ప్రస్తుతానికి పరిస్థితి ప్రశాంతంగానే ఉన్నప్పటికి, విద్యార్థులు బయటకు రావొద్దు. ఏదైనా సమస్య ఉంటే వెంటనే ఎంబసీని సంప్రదించాలి’’ అంటూ 24 గంటలు అందుబాటులో ఉండే ఒక ఫోన్ నంబర్(0555710041)ను షేర్ చేసింది. కిర్గిస్థాన్, ఈజిప్ట్కు చెందిన విద్యార్థుల మధ్య మే 13న జరిగిన ఘర్షణకు సంబంధించి వీడియోలు వైరల్ కావడం దాడులకు దారితీసిందని తెలిపింది. ఆ తర్వాత కొన్ని మూకలు బిషెక్లో భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ విద్యార్థులు ఉండే హాస్టళ్లను లక్ష్యంగా చేసుకున్నాయి. ఈ రోజు ఉదయం విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కూడా ఈ అల్లర్లపై స్పందించారు. భారతీయ విద్యార్థుల సంక్షేమాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామన్నారు. ఎంబసీతో టచ్లో ఉండాలని అక్కడున్న మనవారికి సూచించారు. ఈ మూక హింసలో పలువురు పాకిస్థానీ విద్యార్థులు గాయపడటంతో కేంద్రం నుంచి సూచన వచ్చింది. ముగ్గురు పాకిస్థాన్ విద్యార్థులు మృతి చెందారంటూ కొన్ని సోషల్ మీడియా పోస్టులు వైరల్ అయ్యాయి. అయితే దానికి అధికారికంగా ఎలాంటి ధ్రువీకరణ లేదు.