నారద వర్తమాన సమాచారం
జూన్ :17
చిలకలూరిపేటకే గర్వకారణంగా తెలుగుతేజం కృష్ణతేజ: ప్రత్తిపాటి
ఐఏఎస్ అధికారి కృష్ణతేజకు మాజీమంత్రి ప్రత్తిపాటి అభినందనలు
జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం అందుకున్న తెలుగుతేజం, కేరళలో ఐఏఎస్ అధికారిగా పని చేస్తోన్న కృష్ణతేజ చిలకలూరిపేటకే గర్వకారణమన్నారు మాజీమంత్రి, స్థానిక ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు. చిత్తశుద్ధి, నిజాయతీ, అంకితభావంతో సివిల్ సర్వీసెస్లో అడుగు పెట్టిన రోజు నుంచి పుట్టినప్రాంతానికి మంచిపేరు తెస్తూనే ఉన్నారని కృష్ణతేజపై ప్రశంసల వర్షం కురిపించారాయన. తెలుగు ఐఏఎస్ అధికారి ఎంవీఆర్ కృష్ణతేజ జాతీయ బాలల రక్షణ కమిషన్ పురస్కారం అందుకోనుండడం ఎంతో సంతోషాన్నిచ్చిందన్నారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటకు చెందిన కృష్ణతేజ ప్రస్తుతం త్రిస్సూర్ జిల్లా కలెక్టర్గా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే డ్రగ్స్పై వ్యతిరేక పోరాటంలో భాగంగా బాలల హక్కుల రక్షణలో త్రిస్సూర్ను దేశంలోనే అగ్రస్థానంలో నిలిపారు. పాఠశాలలు, విద్యాసంస్థల పరిధిలో మాదకద్రవ్యాల ప్రభావం తగ్గించడం, అక్రమ రవాణను సమర్థంగా అడ్డుకోగలిగారు. ప్రభుత్వ యంత్రంగాల్ని మొత్తం సమన్వయ పరిచి ఆ విషయంలో తిస్సూర్ను దేశంలోనే ఆదర్శంగా నిలపడంతో ఆయనను ఈ పురస్కారం వరించింది. ఈ నెల 27వ తేదీన దిల్లీలో జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ నిర్వహించే కార్యక్రమంలో ఆ పురస్కారం అందుకోనున్నారు కృష్ణతేజ. ఆయన ఆరేళ్ల క్రితం కేరళలో వరదలు బీభత్సం సృష్టించిన సమయంలో అలెప్పీ సబ్ కలెక్టర్గా తన అత్యుత్తమ పనితీరుతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆపరేషన్ కుట్టునాడు, ఐయామ్ ఫర్ అలెప్పీ కార్యక్రమాలతో వరద బాధితులకు అండగా నిలిచారు. కేరళ పర్యాటకశాఖ సంచాలకుడిగా విశేష కృషి చేశారన్నారు. అవినీతి, అక్రమార్కులను సమర్థంగా అణిచివేశారని ఈ సందర్భంగా ప్రశంసించారు ప్రత్తిపాటి పుల్లారావు.