Thursday, July 16, 2026
spot_img

పల్నాడు జిల్లాలో ముఖ్యమంత్రి, కేంద్ర ఆర్థిక మంత్రి పర్యటన నిమిత్తం పోలీసు అధికారులకు, సిబ్బందికి బ్రీఫింగ్ నిర్వహించిన జిల్లా ఇన్‌చార్జి ఎస్పీ  బి.ఉమామహేశ్వర్ ఐ పీ ఎస్

నారద వర్తమాన సమాచారం

పల్నాడు జిల్లాలో ముఖ్యమంత్రి, కేంద్ర ఆర్థిక మంత్రి పర్యటన నిమిత్తం పోలీసు అధికారులకు, సిబ్బందికి బ్రీఫింగ్ నిర్వహించిన పల్నాడు జిల్లా ఇన్‌చార్జి ఎస్పీ  బి.ఉమామహేశ్వర్ ఐ పీ ఎస్

సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశాం

సమయపాలన పాటిస్తూ నిర్దేశించిన ప్రదేశాల్లో సమర్థవంతంగా విధులు నిర్వహించాలి

విధుల పట్ల అలసత్వం వహిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం

బందోబస్తు విధులు నిర్వహించడానికి విచ్చేసిన పోలీసు అధికారులు, సిబ్బంది సమయపాలన పాటిస్తూ నిర్దేశించిన ప్రదేశాల్లో సమర్థవంతంగా విధులు నిర్వహించాలని పల్నాడు జిల్లా ఇన్‌చార్జి ఎస్పీగా బాధ్యతలు నిర్వహిస్తున్న బాపట్ల జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్, ఐపీఎస్  తెలిపారు. జూలై 17న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి  నిర్మలా సీతారామన్  రుణమేళా కార్యక్రమానికి పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణానికి విచ్చేయనున్న నేపథ్యంలో బందోబస్తు విధులు నిర్వహించనున్న పోలీసు అధికారులు, సిబ్బందికి గురువారం నరసరావుపేట పట్టణంలోని మార్కెట్ యార్డులో ఎస్పీ బ్రీఫింగ్ నిర్వహించారు. మ్యాప్‌ను చూపిస్తూ సెక్టార్ల వారీగా వారు నిర్వహించాల్సిన విధుల గురించి వివరించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ హెలిప్యాడ్, సభా వేదిక, గ్యాలరీలు, కాన్వాయ్ ప్రయాణించే మార్గం, రూఫ్‌టాప్‌లు, పార్కింగ్ ప్రాంతాలు, ట్రాఫిక్ డైవర్షన్ పాయింట్లలో, ఇతర ప్రదేశాలలో విధులు నిర్వహించే పోలీస్ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా తమ విధులను నిర్వర్తించాలన్నారు. బీడీ బృందాలు ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే గ్యాలరీలు, సభా వేదిక వద్దకు వచ్చేవారిని అనుమతించాలని ఆదేశించారు.

ట్రాఫిక్, పార్కింగ్ ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని సీసీ కెమెరాల ద్వారా సభా వేదిక, గ్యాలరీలలోని పరిస్థితులను కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. హెలిప్యాడ్ వద్ద పటిష్టమైన బారికేడింగ్ ఏర్పాటు చేసి, ముఖ్యమంత్రి ని, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ని మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించేందుకు విచ్చేసే వీఐపీలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవడంతో పాటు, ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన అనంతరమే అనుమతించాలని తెలిపారు.

కాన్వాయ్ ప్రయాణించే మార్గంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి అధికారి వైర్లెస్ సెట్ల ద్వారా ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలుసుకుంటూ ఉండాలని, ఏదైనా సమస్య తలెత్తిన వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని ఆదేశించారు. అందరూ సమయపాలన పాటిస్తూ, డ్యూటీ పాస్పోర్ట్ లో ఎవరికి కేటాయించిన ప్రదేశాల్లో వారు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా సమర్థవంతంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. విధి నిర్వహణలో ఎవరైనా అలసత్వం ప్రదర్శించినా, గైర్హాజరైన శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ  హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో పల్నాడు అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) రోహిత్ కుమార్ చౌదరి ఐపీఎస్, అడిషనల్ ఎస్పీ సంతోష్, ఏఆర్ అడిషనల్ ఎస్పీ సత్తిరాజు, ఇంటెలిజెన్స్ అడిషనల్ ఎస్పీ కృష్ణారావు, నరసరావుపేట డీఎస్పీ హనుమంతరావు, బందోబస్తు విధులు నిర్వహించడానికి విచ్చేసిన ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading