నారద వర్తమాన సమాచారం
బక్రీద్ పండగ సందర్భంగా గోవుల అక్రమ రవాణా,గోవధ పై కఠిన చర్యలు ఉంటాయి – పల్నాడు జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు ఐపీఎస్
రానున్న బక్రీద్ పండుగ సందర్భంగా పల్నాడు జిల్లాలో ఎవరైనా పశువుల అక్రమ రవాణా, గోవధ, జంతు హింస మరియు అనుమతులు లేకుండా అక్రమంగా వధశాలలు నిర్వహించడం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధానికి జిల్లా పోలీసు శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు ఐపీఎస్ తెలిపారు. ఇటువంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని తెలిపారు.
జంతు సంక్షేమ పరిరక్షణ మరియు జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ లక్ష్యంగా జిల్లా వ్యాప్తంగా గోవధ నిషేధ చట్టాలపై (PCA Act,1960) ప్రజల్లో అవగాహన కల్పించడం,ప్రత్యేక తనిఖీలు నిర్వహించడం, నిఘా పెంచడం,చెక్ పోస్ట్ ల ఏర్పాటు వంటి చర్యలు కొనసాగనున్నాయని జిల్లా ఎస్పీ తెలిపారు.
పల్నాడు జిల్లా నందు వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో సుమారు 20 ప్రదేశాలలో చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేయనున్నట్లు,ఈ చెక్ పోస్ట్ ల నందు పోలీసు, వెటర్నరీ,రెవిన్యూ మరియు యానిమల్ హస్బెండరీ వారి ఆధ్వర్యంలో సంయుక్తంగా తనిఖీలు నిర్వహించనున్నారు.
ఈ చెక్ పోస్ట్ లు ది.27.05.2026 వ తేదీ బుధవారం ఉదయం నుండి ది.28.05.2026 వ తేదీ అర్ధరాత్రి వరకు నిర్వహించనున్నారు.
జిల్లాలో ఏర్పాటు చేయనున్న చెక్పోస్టు లను బలోపేతం చేసి, ముఖ్య రహదారులు, గ్రామీణ మార్గాలు మరియు సరిహద్దు ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
వాహన తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని ముఖ్యంగా రాత్రి వేళల్లో ప్రత్యేక డ్రైవ్ లు నిర్వహించి అనుమానాస్పద వాహనాలను తనిఖీ చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు.
అంతేకాకుండా సీసీ కెమెరాలు, మొబైల్
పెట్రోలింగ్, డ్రోన్ నిఘా వంటి ఆధునిక సాంకేతిక పద్ధతులను వినియోగిస్తూ అక్రమ రవాణా మరియు గోవధను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
గోవుల అక్రమ రవాణా లేదా గోవధ పేరుతో ఎవరైనా అల్లర్లు,గొడవలు, తగాదాలు సృష్టించడం,మత సామరస్యాన్ని దెబ్బతీసే విధంగా ప్రవర్తించడం కూడా చట్టరీత్యా నేరమని జిల్లా ఎస్పీ తెలిపారు.
కావున పల్నాడు జిల్లా ప్రజలు జిల్లాలో శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకొని ఎటువంటి చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోరాదని సూచించారు.
దీనికి సంబంధించి సామాజిక మాధ్యమాలలో రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడం మరియు వీడియోలను పోస్ట్ చేసిన యెడల వారి పై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకొనబడతాయని తెలిపారు.
ఇప్పటికే జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో మత పెద్దలు, గ్రామ పెద్దలు మరియు ప్రజాప్రతినిధులతో శాంతి కమిటీ సమావేశాలు నిర్వహించి,సామాజిక మరియు మత సామరస్యాన్ని పరిరక్షించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
జిల్లాలో ఎక్కడైనా అక్రమంగా పశువుల రవాణా,గోవధ లేదా అనుమతి లేని వధశాలలు నిర్వహిస్తున్నట్లు సమాచారం తెలిసిన వెంటనే డయల్ 112కు సమాచారం అందించాలని,సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.
ప్రజలు పోలీసు శాఖకు సహకరించి జిల్లాలో శాంతి భద్రతలు,సామాజిక సామరస్యం మరియు జంతు సంక్షేమ పరిరక్షణకు తోడ్పడాలని పల్నాడు జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు ఐపీఎస్ కోరారు..
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








