నారద వర్తమాన సమాచారం
రాజ్యసభ స్థానం కోసం టీడీపీలో ఆసక్తికర చర్చలు….
ఆంధ్రప్రదేశ్లో త్వరలో ఖాళీ కానున్న రాజ్యసభ స్థానాల నేపథ్యంలో అధికార తెలుగుదేశం పార్టీలో రాజకీయ చర్చలు వేడెక్కుతున్నాయి.రాజ్యసభ సీటు కోసం పలువురు సీనియర్ నేతలు,పార్టీకి సేవలందించిన నాయకులు ఆశలు పెట్టుకోవడంతో పార్టీ వర్గాల్లో ఆసక్తికర చర్చ కొనసాగుతోంది.
ఈ నేపథ్యంలో ఈరోజు మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి పలువురు నాయకులు చేరుకుని పార్టీ అధినేత,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసి తమ అభిప్రాయాలను వెల్లడించారు.
పార్టీకి దీర్ఘకాలంగా సేవలందిస్తున్న సీనియర్ నేతలకు ఈసారి అవకాశం కల్పించాలని కోరుతూ మాజీ ఎమ్మెల్సీ వర్ల రామయ్య,మాజీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి,పార్టీ నాయకుడు జంగా కృష్ణమూర్తి తదితరులు సీఎంను కలిసినట్లు తెలిసింది*
రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో సామాజిక సమీకరణాలు,పార్టీకి చేసిన సేవలు,రాజకీయ అనుభవం,భవిష్యత్ వ్యూహాలు వంటి అంశాలను పార్టీ అధిష్టానం పరిగణనలోకి తీసుకుంటోందని సమాచారం.ముఖ్యంగా పార్టీ ఆవిర్భావం నుంచి కష్టకాలంలోనూ పార్టీ వెంట నడిచిన నాయకులకు ప్రాధాన్యత ఇవ్వాలనే అభిప్రాయం టీడీపీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
ఇక మరోవైపు యువ నాయకత్వానికి అవకాశం ఇవ్వాలా? లేక అనుభవజ్ఞులకే ప్రాధాన్యత కల్పించాలా? అనే అంశంపై కూడా పార్టీ అంతర్గతంగా చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది.
రాజ్యసభ స్థానానికి పలువురు ఆశావాహులు ప్రయత్నాలు ముమ్మరం చేయడంతో మంగళగిరి పార్టీ కార్యాలయం వద్ద రాజకీయ సందడి నెలకొంది వచ్చేనెల తొలి వారంలో రాజ్యసభ అభ్యర్థులపై తుది నిర్ణయం తీసుకునే అవకాశముందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
అధిష్టానం నిర్ణయం ఎవరికి అనుకూలంగా ఉంటుందో అనే ఆసక్తి ప్రస్తుతం టీడీపీ నాయకుల్లో నెలకొంది.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








