నారద వర్తమాన సమాచారం
చంద్రబాబుకు ఫోన్ వచ్చింది.. అందుకే మోదీ ఫొటో పెట్టలేదు.. కూటమి మేనిఫెస్టోపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు
కూటమి మేనిఫెస్టోపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అధిష్ఠానం చంద్రబాబుకు ఫోన్ చేసింది.. మేనిఫెస్టోలో మీ ఫొటోలు పెట్టుకోండి.. మోదీ ఫొటో పెడితే ఒప్పుకోబోమని చెప్పినట్టుంది .. అందుకే ఫొటో పెట్టలేదంటూ సీఎం జగన్ ఆరోపించారు. చంద్రబాబు హామీలు మోసమే అని తేలిపోయింది.. కూటమిలోని ముగ్గురి ఫొటోలు పెట్టుకునే పరిస్థితిలేదు.. ప్రజలను మోసం చేయడానికి చంద్రబాబు బరితెగించారు అంటూ ఫైర్ అయ్యారు.
టంగుటూరు, మైదుకూరు, కలికిరిలో ఏర్పాటు చేసిన సభల్లో సీఎం జగన్ పాల్గొని పలు కీలక వ్యాఖ్యలు చేశారు. మీ బిడ్డ హయాంలో ఎలాంటి సంక్షేమ పథకాలు అమలయ్యాయి.. చంద్రబాబు పాలనలో ఎలాంటి మోసాలు జరిగాయో ఆలోచించాలన్నారు. పోలింగ్ రోజు సరైన నిర్ణయం తీసుకోండి అంటూ పదే పదే చెప్తూ మూడు సభల్లోనూ తన ప్రసంగాన్ని కొనసాగించారు సీఎం. మొదటి ఐదేళ్లలో గ్రామస్వరాజ్యాన్ని సాకారం చేశామన్న సీఎం.. వచ్చే ఐదేళ్లలోనూ సంక్షేమ పథకాలను మరింత మెరుగ్గా అందిస్తామన్నారు. ఇంటి దగ్గరకే వెళ్లి పెన్షన్ అందించాలన్న ఆలోచన చంద్రబాబు ఎప్పుడైన చేశారా అని కలికిరి సభలో ప్రశ్నించారు.
అంతకుముందు ప్రకాశం జిల్లా టంగుటూరు సభలో మాట్లాడిన సీఎం జగన్.. చంద్రబాబుకు ఓటు వేస్తే సంక్షేమ పథకాలకు ముగింపే. ఆయన అధికారంలోకి వస్తే చంద్రముఖి నిద్రలేస్తుందన్నారు. చంద్రబాబు హయాంలో 32 వేల ఉద్యోగాలు ఇస్తే తామొచ్చాక 2 లక్షల 31 వేల ఉద్యోగాలిచ్చామన్నారు. చంద్రబాబు 2014లో ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా అమలుచేశారా ప్రశ్నించిన సీఎం .. తాము చేసిన అభివృద్ధి మీ కళ్ల ముందే కనిపిస్తుందన్నారు. చంద్రబాబు హయాంలో వెయ్యి రూపాయల పెన్షన్ ఇస్తే.. తామొచ్చాక దాన్ని మూడు వేల రూపాయలకు పెంచామన్నారు. చంద్రబాబు ఫిర్యాదుతోనే పెన్షన్ పంపిణీలో ఇబ్బందులొచ్చాయన్నారు సీఎం జగన్.
మైదుకూరు సభలో పాల్గొన్న సీఎం జగన్.. గ్రామస్వరాజ్యాన్ని సాకారం చేస్తూ గ్రామగ్రామాన సచివాలయాలు నిర్మించామన్నారు. లంచాలు, వివక్ష లేకుండా సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నామన్న సీఎం ఈ తరహాలో ప్రభుత్వ పథకాలు ఎప్పుడైనా అమలుచేశారా అని ప్రశ్నించారు. చంద్రబాబు పేరు చెప్తే ఒక్క సంక్షేమ పథకమైన గుర్తుకువస్తుందా అన్నారు జగన్.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.