Monday, July 7, 2025

రుణమాఫీ ఫిర్యాదులు ‘లక్ష’.. ‘లెక్క’లోకి రానివి మరెన్నో..!

నారద వర్తమాన సమాచారం

రుణమాఫీ ఫిర్యాదులు ‘లక్ష’.. ‘లెక్క’లోకి రానివి మరెన్నో..!

మంత్రి చెప్పిన లెక్కే 80 వేలు

లెక్క’లోకి రాని ఫిర్యాదులు మరెన్నో

8 వేలు మాత్రమే పరిష్కారం

22 వేల మంది రైతుల ఖాతాల్లోంచి రుణమాఫీ రివర్స్‌

ఫిర్యాదులపై పట్టించుకోని వ్యవసాయ శాఖ

డైరెక్టరేట్‌ క్షేత్రస్థాయిలో అధికారులపైనే పరిష్కార భారం

తెలంగాణ

కాంగ్రెస్‌ ప్రభుత్వం చేస్తున్న రైతు రుణమాఫీ సమస్యల సుడిగుండాన్ని తలపిస్తున్నది. అర్హతలున్నప్పటికీ తమకు రుణమాఫీ కాలేదంటూ రైతుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. నాలుగు రోజుల క్రితం వరకు 80 వేల ఫిర్యాదులు అందినట్టు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఇప్పుడు వీటి సంఖ్య లక్షణంగా లక్షకు చేరినట్టు తెలిసింది. ఇవి అధికారికంగా ఇచ్చిన ఫిర్యాదులు మాత్రమే. క్షేత్రస్థాయిలో ఏఈవోలకు, ఇతర అధికారులకు రైతులు పెట్టుకొన్న ఫిర్యాదుల సంఖ్య ఇందుకు రెట్టింపు ఉంటుందని అధికారులే చెప్తున్నారు. ఇవన్నీ అధికారిక ‘లెక్క’లోకి రావడం లేదు. రుణమాఫీ ప్రారంభమైంది మొదలు.. రైతులు ఏఈవోలు, బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. తమకు రుణమాఫీ కాలేదని, సమస్య పరిష్కరించాలంటూ ప్రతి అధికారికీ మొర పెట్టుకుంటున్నా.. రైతుల మొర అరణ్య రోదనే అవుతున్నదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. స్వీకరించిన, పరిష్కరించిన ఫిర్యాదుల సంఖ్య ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నది.

*ఫిర్యాదులు లక్ష పరిష్కారం 8 వేలు*

వివిధ బ్యాంకుల్లో నెలకొన్న సాంకేతిక సమస్యల కారణంగా 80 వేల ఖాతాలకు సంబంధించిన వివరాలను తెప్పించుకున్నట్టు మంత్రి తుమ్మల వెల్లడించారు. ఇందులో ఆధార్‌ నంబర్‌ ఇవ్వకపోవడం, సరిగ్గా లేకపోవడం, రుణాల మంజూరు తేదీలో తప్పులు ఇలా అనేక కారణాలు ఉన్నాయని వివరించారు. 80 వేల ఖాతాలకు సంబంధించిన సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది. మొదటి రెండు విడతల్లో తప్పులు దొర్లిన 7,925 ఖాతాల సమస్యలను మాత్రమే పరిష్కరించినట్టు మంత్రి తెలపడం గమనార్హం. ఆయా ఖాతాలకు రూ.44.95 కోట్లు విడుదల చేసినట్టు చెప్పారు. అధికారికంగా 80 వేల ఖాతాల్లో సమస్యలు ఉంటే, ప్రభుత్వం పరిష్కరించింది 8 వేలు మాత్రమే. నెల రోజుల్లో 8 వేల ఖాతాల సమస్యలను మాత్రమే పరిష్కరించగా మిగిలిన 72 వేల ఖాతాల సమస్యలను పరిష్కరించేందుకు ఎన్ని నెలల సమయం తీసుకుంటారోననే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. 22 వేల ఖాతాల్లో జమైన రుణమాఫీ డబ్బు రివర్స్‌ వచ్చినట్టు తెలిపారు. రైతుల ఖాతాల్లో జమైన పైసలు.. తిరిగి ప్రభుత్వ ఖాతాల్లోకి వెళ్లడం గమనార్హం.

*ఫిర్యాదులకు పరిష్కారమెక్కడ?*

రుణమాఫీ కాని వారు అధికారులకు ఫిర్యాదు చేయాలని, పరిష్కరిస్తామని ప్రభుత్వం చెప్తున్నది. కానీ, వాటికి పరిష్కారం ఎప్పుడు, ఎక్కడ అనే ప్రశ్నలకు సమాధానం దొరకడం లేదు. రుణమాఫీ ఫిర్యాదులకు సంబంధించి వ్యవసాయ శాఖ డైరెక్టరేట్‌లో ప్రత్యేకంగా ఎలాంటి ఏర్పాట్లు చేయలేదని ఉన్నతాధికారి ఒకరు స్పష్టంచేశారు. మొత్తం క్షేత్రస్థాయిలోనే పరిష్కరిస్తున్నారని తెలిపారు. దీంతో వ్యవసాయ శాఖ ఉన్నతాధికారుల జోక్యం లేకుండా సమస్యల పరిష్కారం జరుగుతుందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖ రైతుల ఫిర్యాదులను పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఫిర్యాదుల భారాన్ని మొత్తం క్షేత్రస్థాయి అధికారులకు అప్పగిస్తే.. సమస్యల పరిష్కారం ఏ మేరకు అవుతుందనే సందేహం వ్యక్తమవుతున్నది. ఫిర్యాదు చేసిన రైతులు తమ సమస్య పరిష్కారమైందా? అంటూ క్షేత్రస్థాయి అధికారులను ఆరా తీస్తున్నారు. ఎక్కడి సమస్య అక్కడే ఉన్నదంటూ అధికారులు చెప్తున్న సమాధానంతో రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. తమ ఫిర్యాదును పరిష్కరిస్తారా? లేదా? తమకు రుణమాఫీ అవుతుందా? లేదా? అంటూ ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version