నారద వర్తమాన సమాచారం
నిన్నటి విధ్వంసం నుంచి రేపటి వికాసం వైపు అమరావతి
రాజధాని నిర్మాణం రాష్ట్రానికి నవోదయం
రాష్ట్రంలోని ప్రతి పౌరుడు గర్వపడేలా ప్రజా రాజధాని : సిఎం చంద్రబాబు
క్యాపిటల్ రీ స్టార్ట్ కార్యక్రమంపై సమీక్ష-ప్రధాని సభ గ్రాండ్ సక్సెస్ చేయాలన్న సిఎం
అమరావతి,
ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా రాజధాని అమరావతి పనుల పున:ప్రారంభ కార్యక్రమంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ఉండవల్లి నివాసంలో మంత్రులు, ఉన్నతాధికారులతో మే2వ తేదీన జరిగే సభ ఏర్పాట్లపై చర్చించారు. ప్రధాని చేతుల మీదుగా అమరావతి పనులు మళ్లీ ప్రారంభం అవుతున్నాయని… ఆ రోజు రాష్ట్ర చరిత్రలో గొప్ప మలుపు కానుందని సిఎం అన్నారు. నిన్నటి విధ్వంసం నుంచి రేపటి వికాసం వైపు రాష్ట్ర రాజధాని ప్రయాణం సాగనుందని సిఎం అన్నారు. గత ప్రభుత్వం అమరావతిని దెబ్బతీయాలని అనేక కుట్రలు, దాడులు చేసిందని… అయితే అన్ని ప్రాంతాల, అన్ని వర్గాల ప్రజల అభిలాష మేర ప్రారంభమైన అమరావతి అనేక సవాళ్లను, కష్టాలను ఎదుర్కొని నిలబడిందని సిఎం అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 10 నెలల్లో… గత ప్రభుత్వ కారణంగా తలెత్తిన సవాళ్లను పరిష్కరించి, నిలిచిపోయిన పనులను మళ్లీ పట్టాలెక్కిస్తున్నామని సిఎం అన్నారు. ఏ ప్రధాని చేతుల మీదుగా అయితే శంకుస్థాపన చేసిన రాజధానిని విధ్వంసం చేశారో… నేడు మళ్లీ అదే ప్రధాని చేతుల మీదుగా పనులు తిరిగి ప్రారంభించి… ఒక అద్భుత రాజధానిని నిర్మించి… విధ్వంసకారులకు గట్టి సమాధానం చెబుతున్నామని సిఎం అన్నారు. అమరావతి అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆత్మగౌరవం, ఆకాంక్ష, సెంటిమెంట్ అని… దీన్ని ఎవరూ దెబ్బతీయలేరని సిఎం అన్నారు. అమరావతి సంపద సృష్టి కేంద్రంగా, అన్ని వర్గాల ప్రజలకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించే ప్రాంతంగా మారుతుందని సిఎం అన్నారు. కుట్రలకు, కుతంత్రాలకు ప్రజా రాజధాని, ఆంధ్రుల స్వప్నాన్ని ఎవరూ చెరిపివేయలేరని చాటి చెప్పేందుకే… మళ్లీ దేశం అంతా గుర్తించేలా రాజధాని పనులను స్వయంగా ప్రధాని చేతుల మీదుగా పున: ప్రారంభిస్తున్నామని సిఎం అన్నారు. ఈ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా, వేడుకగా నిర్వహించాలని… రాష్ట్రంలోని ప్రతి పౌరుడు ‘నాది ఆంధ్ర ప్రదేశ్… నా రాజధాని అమరావతి’ అని చెప్పుకునేలా అమరావతి నిర్మాణం జరుగుతుందన్నారు. ప్రధాని కూడా రాజధాని నిర్మాణంపై ఆసక్తితో ఉన్నారని… మొన్న జరిగిన ఢిల్లీ భేటీలో పలు సూచనలు చేశారని సిఎం గుర్తు చేశారు.
ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు :
ఈ సందర్భంగా ప్రజెంటేషన్ ద్వారా అధికారులు 2వ తేదీ కార్యక్రమ నిర్వహణ క్రమాన్ని, ఏర్పాట్లను వివరించారు. వివిధ జిల్లాల నుంచి వచ్చే ప్రజలకు అసౌకర్యం కలగకుండా, ట్రాఫిక్ అంతరాయాలు లేకుండా చూడాలని సిఎం సూచించారు. ఎండల తీవ్రత దృష్ట్యా దూర ప్రాంతాల నుంచి సభకు వచ్చే వారికి తాగునీరు, ఆహారం అందించాలని సిఎం సూచించారు. భద్రతా పరంగా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని… ఇదే సమయంలో సామాన్య ప్రజలు ఇబ్బంది పడకుండా వేదిక వద్దకు చేరుకునేలా చూడాలన్నారు. ముఖ్యంగా రాజధాని గ్రామాల ప్రజలకు ఈ కార్యక్రమంలో ఎక్కువ భాగస్వామ్యం ఉంటుందని… వారంతా సభకు రావాలని భావిస్తారని సిఎం అన్నారు. రవాణా సహా ఇతర అంశాల్లో అధికారులు ఎప్పటికప్పుడు తగు సూచనలు, ప్రకటనలు చేసి ఎవరికీ అసౌకర్యం కలగకుండా చూడాలన్నారు. ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, నారాయణ, కొల్లు రవీంద్ర, మనోహర్, సత్యకుమార్ హాజరయ్యారు. డీజీపీతో పాటు వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.