నారద వర్తమాన సమాచారం
భారీ రవాణా అవుతున్న గంజాయి పట్టివేత..
-లారీలో తరలిస్తున్న సుమారు రూ.22 లక్షలు విలువజేసే 730 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్న తూర్పుగోదావరి జిల్లా పోలీసులు
-వివరాలు వెల్లడించిన దేవరపల్లి సీఐ బీ నాగేశ్వర నాయక్
తూర్పు గోదావరి జిల్లా, దేవరపల్లి :
లారీలో అక్రమంగా రవాణా చేస్తున్న 730 కేజీల గంజాయిని తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండలం యర్నగూడెంలో పోలీసులు పట్టుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు 22 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఇందుకు సంబంధించి దేవరపల్లి సీఐ బీ నాగేశ్వర నాయక్ మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ కు చెందిన కర్రే శ్రీశైలం (ఏపీ 16 టీఎక్స్ 5319) లారీలో ఒడిస్సా మల్కాన్ గిరి ప్రాంతానికి వెళ్ళి గంజాయి తీసుకుని హైదరాబాదులో నర్సిరెడ్డి, యాదయ్యలకు సప్లై చేస్తే ఎక్కువ మొత్తంలో డబ్బులు ఇస్తామని ఆశ చూపారు. దీంతో శ్రీశైలం మల్కాన్ గిరి వెళ్ళి గంజాయిని తన లారీ సీక్రెట్ కాబిన్ లో నింపుకున్నాడు. తెలంగాణా కు రవాణా చేయటానికి హైవే మార్గంలో దేవరపల్లి మీదుగా వెళుతుండగా డైమండ్ జంక్షన్ దాటిన తరువాత గోల్డెన్ ఫిష్ ధాబా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఈ అక్రమ గంజాయి రవాణా గుట్టు బయట పడింది. గోల్డెన్ ఫిష్ ధాబా దగ్గర హైవే రోడ్డులో బైక్ ను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై వెళుతున్న జంట అక్కడికక్కడే మృతిచెందారు. దీంతో లారీ డ్రైవర్ శ్రీశైలం (ముద్దాయి) లారీతో సహా కొవ్వూరు నుంచి నల్లజర్ల పోవు ఎన్హెచ్ 16 సర్వీసు రోడ్డు పక్కన యర్నగూడెం గ్రామ శివార్లలో ఇటుకల బట్టి వద్ద ఎవరికీ కనబడకుండా లారీని పార్క్ చేశాడు. తమకు అందిన సమాచారం మేరకు గంజాయితో ఉన్న లారీని స్వాధీనం చేసుకుని, ముద్దాయి ని అరెస్టు చేసినట్టు సీఐ నాగేశ్వర నాయక్ తెలిపారు. ఈ కేసులో హైదరాబాదు కు చెందిన నర్సిరెడ్డి, యాదయ్యలను అరెస్టు చేయాల్సి ఉందన్నారు. లారీలో ఉన్న 18 గంజాయి మూటలు (730 కేజీలు), లారీ, ఒక సెల్ ఫోన్, వెయ్యి రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్టు సీఐ తెలిపారు. ముద్దాయిని జ్యుడీషియల్ రిమాండ్ నిమిత్తం కొవ్వూరు కోర్డుకు తరలించామన్నారు. ఈ కేసులో ప్రతిభ కనబర్చిన దేవరపల్లి ఎస్సై, హెచ్సీ వీ చక్రవర్తి, వీ చంద్రశేఖర్, ఆరగవీ రమణ, షేక్ సలీం, పీ రామారావు లను జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ ప్రత్యేకంగా అభినందించారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.