నారద వర్తమాన సమాచారం
ఖాళీగా ఉన్న డబుల్ బెడ్రూమ్ / ఇందిరమ్మ ఇండ్లతో పేదల సొంతింటి కలను వెంటనే నెరవేర్చాలి
ప్రభుత్వానికి రాపోలు లింగస్వామి అత్యవసర విజ్ఞప్తి
ఎల్బీ నగర్లో
ఖాళీగా ఉన్న డబుల్ బెడ్రూమ్, ఇందిరమ్మ ఇండ్లను వెంటనే గుర్తించి అర్హులైన పేద కుటుంబాలకు కేటాయించి వారి సొంతింటి కలను సాకారం చేయాలని సీనియర్ జర్నలిస్ట్, ఆర్టీఐ రక్షక్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాపోలు లింగస్వామి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
గురువారం సైదాబాద్లో ఆయన మాట్లాడుతూ, హైదరాబాద్లో అతిపెద్ద స్లమ్ ఏరియాల్లో ఒకటైన సింగరేణి కాలనీలో రాష్ట్ర నలుమూలల నుంచి ఉపాధి కోసం వలస వచ్చిన వేలాది పేద కుటుంబాలు గుడిసెలు, అద్దె ఇండ్లలో నివసిస్తూ తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు. పెరుగుతున్న అద్దెలు, నిత్యావసరాల ధరల భారం కారణంగా పేదల జీవనం మరింత కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.
పేదల సొంతింటి కలను నెరవేర్చాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అమలు చేస్తున్న డబుల్ బెడ్రూమ్, ఇందిరమ్మ ఇండ్ల పథకాలకు అర్హులు పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నప్పటికీ, గతంలో కొద్ది మందికే ఇండ్లు కేటాయించారని తెలిపారు. నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల్లో భాగంగా ప్రజాపాలన కింద దరఖాస్తులు స్వీకరించినా, సర్వే ప్రక్రియ పూర్తిస్థాయిలో జరగకపోవడంతో అనేక మంది అర్హుల పేర్లు సర్వే జాబితాల్లో నమోదు కాలేదని పేర్కొన్నారు.
దీంతో తమకు ఎప్పుడైనా సొంత ఇల్లు దక్కుతుందా? లేదా? అనే అనిశ్చితిలో పేద కుటుంబాలు ఆందోళనకు గురవుతున్నాయని తెలిపారు. ప్రభుత్వం ఏర్పడి దాదాపు మూడేళ్లు కావస్తున్నా కానీ ఖాళీగా ఉన్న ఇందిరమ్మ ఇండ్లను ఇప్పటికీ పూర్తి స్థాయిలో కేటాయించకపోవడం పేదల పట్ల నిర్లక్ష్యాన్ని సూచిస్తోందని విమర్శించారు.
ఒకవైపు అద్దె భారం, మరోవైపు ఆర్థిక కష్టాలతో పేద ప్రజలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని, ఇకనైనా ప్రభుత్వం ఆలస్యం చేయకుండా తక్షణమే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. పూర్తి స్థాయి సర్వే నిర్వహించి అర్హులైన ప్రతి పేద కుటుంబాన్ని గుర్తించి, ఖాళీగా ఉన్న డబుల్ బెడ్రూమ్, ఇందిరమ్మ ఇండ్లను వెంటనే కేటాయించాలని, తద్వారా పేద ప్రజల సొంతింటి కలను సాకారం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రాపోలు లింగస్వామి ఒక ప్రకటనలో అత్యవసరంగా విజ్ఞప్తి చేశారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








