నారద వర్తమాన సమాచారం
గుంటూరు వెస్ట్ శానిటేషన్లో వెనకబడి ఉండడానికి వీల్లేదు – ఎమ్మెల్యే గళ్ళా మాధవి
శానిటేషన్ పై నెలరోజుల ప్రత్యేక మానిటరింగ్ – ఎమ్మెల్యే గళ్ళా మాధవి హెచ్చరిక
“గుంటూరు వెస్ట్ – శానిటేషన్ లో బెస్ట్” అనేలా పనిచేయాలని సూచన
గుంటూరు పశ్చిమ నియోజకవర్గం శానిటేషన్లో వెనకబడి ఉండడానికి వీల్లేదని, శానిటేషన్ పై నెల రోజుల ప్రత్యేక మానిటరింగ్ చేయనున్నామని, గుంటూరు వెస్ట్ – శానిటేషన్ లో బెస్ట్” అనేలా పనిచేయాలని ఎమ్మెల్యే గళ్ళా మాధవి సూచించారు. గురువారం గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో శానిటరీ సూపర్వైజర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లతో ఎమ్మెల్యే గళ్ళా మాధవి సమీక్షా సమావేశం నిర్వహించారు. గుంటూరు కార్పొరేషన్ పరిధిలో ప్రజల నుంచి అధికంగా వస్తున్న సమస్యలపై విస్తృతంగా చర్చించిన ఎమ్మెల్యే, ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ మరియు శానిటేషన్ విభాగాల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. గుంటూరు కార్పొరేషన్ పనితీరులో చాలా అంశాలు మెరుగ్గా ఉన్నప్పటికీ, ప్రజల నుంచి ప్రధానంగా శానిటేషన్ మరియు టౌన్ ప్లానింగ్పై విపరీతమైన ఫిర్యాదులు వస్తున్నాయని, ముఖ్యంగా సీఎంఓ సర్వే రిపోర్టుల్లో కూడా గుంటూరు శానిటేషన్ వెనుకబడి ఉందని రావడం బాధాకరమన్నారు. ఇది తనకే కాదు, మొత్తం వ్యవస్థకే మచ్చ అని పేర్కొన్నారు.
సాధారణ ప్రజల నుంచి చెత్త సేకరణ, డ్రైనేజీ డీసిల్టేషన్, పబ్లిక్ ప్రదేశాల్లో చెత్త కుప్పలపై నిరంతర ఫిర్యాదులు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేకంగా 23వ డివిజన్లో ఐటీసీ క్రాస్ సమీపంలోని ఎస్బీఐ బ్యాంక్ వెనుక ప్రాంతంలో తరచూ చెత్త పేరుకుపోతున్న విషయాన్ని ఉదాహరణగా ప్రస్తావిస్తూ, అక్కడ పరిస్థితి ఎందుకు మారడం లేదని ప్రశ్నించారు. చెత్తను తొలగించిన కొద్ది గంటల్లోనే మళ్లీ పెద్ద కుప్పలు ఏర్పడుతున్నాయని, దీనిపై బాధ్యతగా వ్యవహరించి శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు.
స్కూళ్లు, ప్రార్థన స్థలాలు, ప్రజలు అధికంగా తిరిగే ప్రాంతాల వద్ద డంపింగ్ పాయింట్లు ఉండటం అస్సలు సహించబోమని స్పష్టం చేశారు. డ్రైనేజీ డీసిల్టేషన్ కూడా అన్ని డివిజన్లలో ప్రధాన సమస్యగా మారిందని, మూడు నాలుగు రోజులకు ఒకసారి మాత్రమే శుభ్రపరిచే పరిస్థితి మారాలని సూచించారు.
ఈ నేపథ్యంలో ఈరోజు నుంచి నెలరోజులపాటు ప్రత్యేక మానిటరింగ్ చేపడుతున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. జూన్ 7వ తేదీ నాటికి ప్రతి డివిజన్ పనితీరుపై పూర్తి నివేదిక సిద్ధం చేస్తామని తెలిపారు. ప్రతి డివిజన్లో గార్బేజ్ కలెక్షన్, డ్రైనేజీ శుభ్రత, సిబ్బంది పనితీరు, మేస్త్రీలు-వర్కర్ల సమన్వయం వంటి అంశాలను ప్రత్యేకంగా పరిశీలిస్తామని చెప్పారు.
ప్రతి ఒక్కరు తమ డివిజన్ను బెస్ట్ శానిటేషన్ డివిజన్గా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకోవాలి” అని ఎమ్మెల్యే గళ్ళా మాధవి సూచించారు. కష్టపడి పనిచేసే సిబ్బందిని అభినందిస్తూనే, నిర్లక్ష్యంగా వ్యవహరించే వారు మారాల్సిన అవసరం ఉందన్నారు.
స్వచ్ఛాంధ్ర కార్యక్రమంపై ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి పెట్టారని, ప్రతి అంశం రాష్ట్ర స్థాయిలో మానిటరింగ్ అవుతోందని చెప్పారు. కాబట్టి సమస్యలను దాచిపెట్టకుండా, పరిష్కార మార్గాలు సూచిస్తూ బాధ్యతగా పని చేయాలని అధికారులకు సూచించారు.
అలాగే రాబోయే మూడు నెలల్లో గుంటూరు కార్పొరేషన్ శానిటేషన్ వ్యవస్థను మెరుగుపరిచి, వెనుకబడిన విభాగం అనే ముద్రను పూర్తిగా తొలగించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు.
గుంటూరు వెస్ట్ శానిటేషన్లో బెస్ట్ అవ్వాలి అన్నదే నా లక్ష్యం. ప్రజల నుంచి వచ్చే ప్రతి ఫిర్యాదును సీరియస్గా తీసుకుని పని చేయాలి. రాబోయే రోజుల్లో మీ అందరికీ కూడా రిపోర్ట్ కార్డులు ఇస్తాం. అందులో ప్రతి ఒక్కరూ ఫస్ట్ రావాలి” అని ఎమ్మెల్యే గళ్ళా మాధవి పిలుపునిచ్చారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








