Tuesday, June 10, 2025

మెగా యోగా స్ఫూర్తితో వికసించిన పల్నాడు జిల్లా కలెక్టరేట్ పెరేడ్ గ్రౌండ్…..!

నారద వర్తమాన సమాచారం

మెగా యోగా స్ఫూర్తితో  వికసించిన పల్నాడు జిల్లా కలెక్టరేట్ పెరేడ్ గ్రౌండ్…..!

యోగ పలనాడు

కలెక్టరేట్ పరేడ్ గ్రౌండ్స్ లో వికసించిన యోగా స్ఫూర్తి

వేలమందితో కలిసి సామూహిక యోగాలో పాల్గొన్న ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు, జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు

నరసరావు పేట, జూన్ 05

గురువారం ఉదయం స్థానిక కలెక్టరేట్ పరేడ్ గ్రౌండ్స్ యోగా స్పూర్తితో వికసించింది. దాదాపు రెండు గంటల పాటూ పరేడ్ గ్రౌండ్ ప్రాంగణం యోగామయమైంది. ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకూ వేలమంది ఏకకాలంలో యోగముద్రలో నిలవడం ద్వారా రాష్ట్ర స్థాయి యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొని ‘యోగ పలనాడు’కు జీవం పోశారు.

రాష్ట స్థాయి యోగాంధ్ర కార్యక్రమాన్ని గురువారం ఉదయం స్థానిక కలెక్టరేట్ పరేడ్ గ్రౌండ్స్ నందు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు, ఎస్పీ కంచి శ్రీనివాస రావు మరియు జిల్లా అధికారులతో కలిసి ఉత్సాహంగా యోగాసనాలు వేశారు.

యోగాపై అవగాహన పెరిగింది: జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు

మే 21 న యోగాంధ్ర కార్యక్రమం ప్రారంభం నాటి నుంచి జిల్లాలో చేపట్టిన యోగాంధ్ర కార్యక్రమాల ద్వారా ప్రజల్లో యోగా గురించిన అవగాహన పెరిగిందని జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు అన్నారు. గ్రామ స్థాయినుంచి యోగా కార్యక్రమాలు చేపట్టి ప్రజలను చైతన్యవంతం చేయడం జరుగుతోందన్నారు.

యోగా అనేది ఒక నెల రోజుల కార్యక్రమంగా భావించకుండా ప్రతి ఒక్కరూ రోజుకు అరగంట పాటూ యోగాసనాల కోసం కేటాయించాలన్నారు.

కలెక్టరేట్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన కార్యక్రమాన్ని విజయవంతం చేసిన జిల్లా అధికారులు, అంగన్ వాడీ టీచర్లు & ఆయాలు, వైద్య ఆరోగ్య శాఖ, పోలీసు శాఖ సిబ్బంది, ప్రజా ప్రతినిథులు, సామాన్య ప్రజానీకానికి అభినందనలు తెలిపారు.
గత రెండు వారాలుగా జిల్లాలో చేపడుతున్న యోగాంధ్ర కార్యక్రమాలకు ప్రజల్లో విశేష ప్రచారం కల్పిస్తున్న జిల్లా పాత్రికేయులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ప్రతి పనిలో యోగా : ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు
మనం దైనందిన జీవితంలో భాగంగా చేసుకునే ప్రతి పనిలో యోగా భాగమై ఉంటుందని ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు వ్యాఖ్యానించారు. చిన్న చిన్న పనులకు సైతం యంత్రాలను వాడటం తగ్గించి శారీరక శ్రమను నిర్లక్ష్యం చేయడం మనం యోగాకు దూరం అవుతున్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.

75 ఏళ్లకు చేరువలో ప్రతి రోజూ యోగా చేయడం ద్వారా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నా చంద్రబాబు నాయుడులు పాతికేళ్ల యువకులలాగా ఉత్సాహంగా బాధ్యతలు నిర్వర్తించగలుతున్నారని యోగా అవశ్యకతను తెలియజేశారు.

యోగాను అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం చేయడంలో భాగంగా జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం నాడు గిన్నిస్ బుక్ రికార్డు సాధించే ప్రయత్నానికి ప్రజలు అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

క్రమ శిక్షణతో కూడిన జీవన విధానమే యోగా: ఎస్పీ కంచి శ్రీనివాస రావు
యోగా అంటే క్రమశిక్షణతో కూడిన జీవన విధానం అని జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు అన్నారు. జీవన విధానంలో క్రమ శిక్షణ తప్పినప్పుడే రక్త పోటు, మధుమేహం వంటి రోగాల బారిన పడతామన్నారు. యోగాసనాల ద్వారా మన శరీరాన్ని, మన మనసును అదుపులో ఉంచుకొని నిర్మాణాత్మకమైన జీవితం గడపవచ్చని.. స్వీయ నియంత్రణ లేని వారు సమాజానికి విచ్చిన్నకరంగా తయారవుతారన్నారు. యోగాను మనం వ్యక్తిగతంగా పాటించి భావితరాలకు అందించగలిగితే సమాజానికి మనం ఇవ్వగలిగే గొప్ప బహుమానం అన్నారు. ప్రతి ఒక్కరూ దైనందిన జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్ పర్సన్ గోనుగుంట్ల కోటేశ్వర రావు మాట్లాడుతూ యోగా చేయడం వల్ల ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుందని, ఆసుపత్రులకు వెళ్లాల్సిన అవసరం ఉండదన్నారు.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version