నారద వర్తమాన సమాచారం
ఘనంగా మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి నివాళులు అర్పించిన పల్నాడు జిల్లా డి ఆర్వో, నారదమని …
రాష్ట్ర ప్రభుత్వం ఆదేశానుసారం పల్నాడు జిల్లా కలెక్టర్ సూచన మేరకు పీజీఆర్ఎస్ హాల్లో డిఆర్వో నారదముని ఆధ్వర్యంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజనులను అన్ని రకాలుగా చైతన్యపరచి బ్రిటీష్ ప్రభుత్వంపై పోరాడిన మహోన్నత నాయకుడు అల్లూరి సీతారామరాజు అని కొనియాడారు. అల్లూరి సీతారామరాజు (1897 జూలై 4 – 1924 మే 7) భారత స్వాతంత్ర్య పోరాటంలో ప్రముఖ విప్లవకారుడని, ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా మోగల్లు గ్రామంలో జన్మించిన ఆయన బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా గిరిజనులను సమీకరించి సాయుధ పోరాటం నిర్వహించారని తెలిపారు.
సీతారామరాజు తన ప్రాథమిక విద్యను పశ్చిమ గోదావరి జిల్లాలోని వివిధ గ్రామాల్లో అభ్యసించారని, 15 ఏళ్ల వయస్సులో విశాఖపట్నంలో ఉన్న హైస్కూల్ మరియు విశ్వవిద్యాలయంలో విద్యను కొనసాగించారని చెప్పారు. 18 ఏళ్ల వయస్సులో సన్యాసిగా మారి జ్యోతిష్యం, ఆయుర్వేదం వంటి విషయాల్లో ప్రావీణ్యం సాధించారని, ఆయన ఆధ్యాత్మికత మరియు త్యాగనిరతి గిరిజనుల్లో విశేషమైన ప్రభావాన్ని చూపిందని వివరించారు.
అలాగే సీతారామరాజు నాయకత్వంలో జరిగిన రంపా తిరుగుబాటు బ్రిటిష్ పాలనకు గట్టి ఎదురుదెబ్బ ఇచ్చిందని తెలిపారు. విశాఖపట్నం మరియు తూర్పు గోదావరి జిల్లాల గిరిజనులను సమీకరించి బ్రిటిష్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేశారని, ఆయన నాయకత్వంలో గిరిజనులు పోలీస్ స్టేషన్లపై దాడులు చేసి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారని పేర్కొన్నారు. ఈ పోరాటం బ్రిటిష్ ప్రభుత్వాన్ని తీవ్రంగా కలవరపరిచిందని తెలిపారు.
1924 మే 7న సీతారామరాజు బ్రిటిష్ సైన్యం చేతిలో పట్టుబడి అనంతరం కాల్చి చంపబడ్డారని, భారత స్వాతంత్ర్య ఉద్యమంలో ఆయన కృషి ఎనలేనిదని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన సంక్షేమ అధికారి గోవింద్ నాయక్ జిల్లా గణాంక అధికారి యు వి సత్యనారాయణ రాజు ,టూరిజం అధికారి నాయుడమ్మ , కోఆర్డినేషన్ సూపరింటెండెంట్ నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








